స్మృతి ఇరానీ కాంగ్రెస్లో చేరాలనుకున్నారు: డిగ్గీ
ఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బిజెపిలో చేరడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ శనివారం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కోసం ఆమె ప్రయత్నించారని, ఆమె ఈ విషయాన్ని ఖండించలేరన్నారు.
పలువురు ఏఐసీసీ నేతలను ఆమె కలిశారన్నారు. అయితే డిగ్గీ వారి పేర్లను వెల్లడించలేదు. గుజరాత్ అల్లర్ల తర్వాత నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన స్మృతీ ఇరానీ.. ఆపై అదే పార్టీలో చేరడం తమను ఆశ్చర్యపరిచిందన్నారు.
ప్రస్తుతం మానవ వనరుల మంత్రిగా ఉన్న ఆమె, 2002 డిసెంబర్ 25న నిరాహార దీక్ష చేశారని, నరేంద్ర మోడీపైచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. నాడు ప్రధాని వాజపేయి పుట్టిన రోజునాడు ఆమె నిరసనకు దిగారని, ఇప్పుడామె మతం, దేశభక్తి గురించి మనకు పాఠాలు చెబుతుండటం విడ్డూరమన్నారు.
స్మతి ఇరాని తన విద్యార్హతల గురించి వాస్తవాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు. స్మృతి విద్యార్హతలేంటో తేల్చి చెప్పాలని ఆయన ప్రధాని మోడీని కూడా శనివారం డిమాండ్ చేశారు. ప్రతి ఎన్నికల అఫిడవిట్లో ఆమె విద్యార్హతలు మారిపోతున్నాయని, దీనిపై స్పష్టత ఇవ్వాలని మోడీని నిలదీస్తున్నా అన్నారు.
స్మృతి ఇరానీ
రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై సభాహక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్షాలు నిర్ణయించాయి. స్మృతి ఉద్దేశపూర్వకంగా పార్లమెంటును తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్, సీపీఎం, జేడీయూలు శనివారం ఇక్కడ ఆరోపించాయి. ఈ తీర్మానాన్ని త్వరలోనే లోకసభ, రాజ్యసభల్లో ప్రవేశపెడతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ
స్మృతి ఇరానీ ప్రసంగం, ప్రధాని మోడీ సత్యమేవ జయతే ట్వీట్ పైన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. రోహిత్ వేముల తల్లి వాదననూ ఓ సారి వినండంటూ ప్రధానికి ఆయన సూచించారు.
సోనియా గాంధీ
రోహిత్ వేముల తల్లి రాధిక శనివారం సోనియా గాంధీని కలిశారు. రోహిత్ చట్టానికి కృషి చేయాలని కోరారు. రోహిత్ తల్లి రాధిక సీతారాం ఏచూరీని కూడా కలిశారు.
సీతారాం ఏచూరీ
దుర్గాదేవి గురించి రాజ్యసభలో తప్పుడు మాటలు చెప్పానని ఆరోపిస్తూ కొంతమంది నుంచి తనకు బెదిరింపు ఫోన్లు, సంక్షిప్త సందేశాలు వస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. సభలో తానెలాంటి వ్యాఖ్యలూ చేయలేదని శనివారం స్పష్టం చేశారు. తాను కచ్చితంగా ఏం మాట్లాడానో యూట్యూబ్లో ఉందన్నారు. మితవాద శక్తుల నుంచి శనివారం పగటి పూట సుమారు వెయ్యి వరకు ఫోన్లు, 500 సందేశాలు తన వ్యక్తిగత ఫోనుకు వచ్చాయని వివరించారు. ఎవరిపేరునూ ఆయన ప్రస్తావించలేదు.