దుస్తులు మార్చుకునే గదిలో కెమెరా: స్మృతికి క్షమాపణలు
పనాజీ: గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణంలో దుస్తులు మార్చుకునే గది దిశగా రహస్య కెమెరాను అమర్చిన విషయంలో.. సదరు వస్త్ర దుకాణం యాజమాన్యం కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి శనివారం నాడు క్షమాపణలు చెప్పారు.
తమ వస్త్ర దుకాణాల్లో ట్రయల్ గదుల్లో సహా ఎక్కడా రహస్య కెమెరాలను అమర్చలేదని, ఫ్యాబ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. అనుకోకుండా తలెత్తిన అసౌకర్యానికి స్మృతికి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొంది. మరోవైపు, ఫ్యాబ్ ఇండియా ఎండీ, అధికారులను పోలీసులు ప్రశ్నించనున్నారు.
కాగా, గోవాలోని ఫాబ్ ఇండియా దుస్తుల దుకాణంలో రహస్య కెమెరా వ్యవహారంపై పోలీసులు అరెస్టు చేసిన నలుగురికి బెయిల్ లభించిన విషయం తెలిసిందే. బట్టల దుకాణంలోని రహస్య కెమెరాను గుర్తించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.
పరేష్ భగత్, రాజు పాయాంచే, ప్రశాంత్ నాయక్, కరీం లఖానీ అనే నలుగురిని పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఆ తర్వాత కేసులు నమోదు చేశారు. ఆ నలుగురికి కూడా కోర్టు షరతులతో కూడిన బెయిల్ను శనివారం మంజూరు చేసింది.
మరోవైపు, ఈ కేసులో ఫాబ్ ఇండియా కాండోలిమ్ స్టోర్ మేనేజర్ ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అది రహస్యమైన కెమెరా ఏమీ కాదని, అందరికీ కనిపించేట్లే ఏర్పాటు చేశామని ఫాబ్ ఇండియా అంతకుముందు చెప్పింది.