విద్యార్హతల విషయంలో మరోసారి అబద్దం, అఫిడవిట్తో అడ్డంగా బుక్కైన స్మృతి ఇరానీ
ఢిల్లీ : విద్యార్హతల విషయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. అమెరికా యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశానని చెప్పుకున్న ఆమె అబద్దమాడారని మరోసారి రుజువైంది. గతంలో తాను యేల్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందినట్లు స్మృతి ప్రకటించారు. తాజాగా అమేథీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఆమె అఫిడవిట్లో తాను డిగ్రీ పూర్తి చేయలేదని స్పష్టం చేశారు. దీంతో విపక్షాలకు ఒక అస్త్రం దొరికినట్లైంది.
రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు: కాంగ్రెస్ లేఖ, అసలేం జరిగిందంటే?
ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ
2004లో ఢిల్లీలోని చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ పై స్మతి పోటీ చేశారు. అప్పట్లో ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో ఆమె తాను 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కరెస్పాండెన్స్ ద్వారా బీఏ పూర్తి చేసినట్లు చెప్పారు. అయితే 2014లో అమేథీ నుంచి తొలిసారి బరిలో దిగిన స్మృతి అప్పట్లో సమర్పించిన అఫిడవిట్లో 1994లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కరెస్పాండెన్స్ ద్వారా బీకాం ఫస్ట్ ఇయర్ పూర్తిచేసినట్లు చెప్పారు. దీంతో విద్యార్హత విషయంలో ఆమె అబద్దమాడారని బయటపడింది.
యేల్ డిగ్రీ ఉందన్న స్మృతి
ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలైన స్మతి ఇరానీ గతంలో మానవ వనరుల శాఖ బాద్యతలు నిర్వహించారు. ఆ సమయంలో హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య విషయంలో హెచ్ఆర్డీ శాఖ తీరు వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఆమె విద్యార్హతలపైనా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన స్మృతి తాను అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందినట్లు విలేకరుల సమావేశంలో చెప్పుకున్నారు. అప్పట్లో ఆమె ప్రకటన పెద్ద దుమారమే రేపింది. స్మృతికి యేల్ డిగ్రీ ఉంటే ఆమె 2014లో ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో ఎందుకు పొందుపర్చలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. విద్యార్హతల విషయంలో ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారని అప్పట్లో కేసు కూడా నమోదైంది.
డిగ్రీ పూర్తిచేయలేదు
తాజాగా గురువారం అమేథీలో నామినేషన్ సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో స్మృతి విద్యార్హతను మళ్లీ బీకాం ఫస్ట్ ఇయర్గా పేర్కొనడం చర్చనీయాంశమైంది. 2014 చెప్పినట్లే ఈసారి కూడా ఢిల్లీ సీబీఎస్సీ బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశానని, దూరవిద్య ద్వారా బీకాం ఫస్ట్ ఇయర్కు రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు. ఆమె స్వయంగా చెప్పుకున్న యేల్ యూనివర్సిటీ డిగ్రీని అందులో ప్రస్తావించకపోవడం విశేషం.
విపక్షాల సటైర్
విద్యార్హతల విషయంలో స్మృతి ఇరానీ పదే పదే అబద్దాలు చెప్పడం ఆమెను ఇరుకున పడేసింది. ఇదే అదునుగా విపక్షాలు ఆమెతో ఆటాడుకుంటున్నాయి. గతంలో బుల్లితెర నటి అయిన స్మృతి ఇరానీపై కాంగ్రెస్ సీరియల్ భాషలో సటైర్లు వేసింది. క్యూ కీ మంత్రి బీ కభీ గ్రాడ్యుయేట్ థీ అని కొత్త సీరియల్ ప్రారంభమైందని, క్వాలిషికేషన్లు మారిపోతాయన్నది ఓపెనింగ్ లైన్ అని, డిగ్రీలు వస్తుంటాయి, పోతుంటాయి, అఫిడవిట్లు మారిపోతుంటాయన్నది ట్యాగ్ లైన్ అని కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది సటైర్ వేశారు.