కార్యకర్తకు నివాళి! పాడె మోసిన స్మృతి ఇరానీ!
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని అమేథీలో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణహత్యకు గురైన బీజేపీ కార్యకర్త అంతిమయాత్రలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పాల్గొన్నారు. మృతదేహానికి నివాళి అర్పించారు. పాడెను మోశారు. హతుడి పేరు సురేంద్ర సింగ్. అమేథీ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని బరౌలియా గ్రామ నివాసి.
50 సంవత్సరాల సురేంద్ర సింగ్పై ఆదివారం తెల్లవారు జామున తన ఇంట్లో నిద్రిస్తున్న సురేంద్రసింగ్పై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేంద్ర సింగ్ను కుటుంబ సభ్యులు లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
#WATCH BJP MP from Amethi, Smriti Irani lends a shoulder to mortal remains of Surendra Singh, ex-village head of Barauli, Amethi, who was shot dead last night. pic.twitter.com/jQWV9s2ZwY
— ANI (@ANI) May 26, 2019
సురేంద్ర హత్యకు సంబంధించి పోలీసులు కొందరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పాతకక్షలు, రాజకీయ వివాదాలు ఈ హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. బరౌలియాకు చెందిన సురేంద్ర సింగ్ ఇదివరకు సర్పంచ్గా పనిచేశారు. ఎన్నికలు సమీపించడంతో స్మృతి ఇరానీ విజయం కోసం రాజీనామా చేశారు. ఆమె విజయం కోసం కృషి చేశారు. స్మృతి ఇరానీకి ఆప్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
సురేంద్ర సింగ్ హత్యోదంతం సమాచారం తెలియగానే స్మృతి ఇరానీ బరౌలియాకు చేరుకున్నారు. సురేంద్ర సింగ్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆయన పాడెను మోశారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సురేంద్ర సింగ్ హత్య తనను కలిచి వేసిందని కన్నీరు పెట్టుకున్నారు. హంతకులను గుర్తించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను ఆదేశించారు.