శబరిమలపై స్మృతీ వ్యాఖ్యలు: బహిష్టు రక్తంతో తడిసిన రుమాలును స్నేహితుల ఇంటికి తీసుకెళతారా?
Recommended Video
శబరిమలై అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పరోక్ష మద్దతు తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసే హక్కు ఉందన్న ఆమె.. ప్రార్థనా గోపురాన్ని అపవిత్రం చేసే హక్కు మాత్రం లేదన్నారు. దీనికి మరో రకంగా ఆమె ఉదాహరణ ఇచ్చారు.
"సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. మహిళ బహిష్టు సమయంలో రక్తంతో తడిసిన రుమాలు తీసుకుని స్నేహితుడి ఇంటికి వెళతారా..? వెళ్లరు కదా.. మరి పవిత్రమైన పుణ్యక్షేత్రం దేవుని ఆలయానికి ఎలా వెళతారు..? ఇదే తేడా. నాకు ప్రార్థించే హక్కు ఉంది. కానీ ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేసే హక్కు నాకు లేదు. ఇదే తేడాను గమనించి గౌరవించాలి"అని స్మృతి ఇరానీ అన్నారు.
ముంబైలో యంగ్ థింకర్స్ పేరుతో బ్రిటీష్ హైకమిషన్ ఓ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్మృతీ ఇరానీ పాల్గొన్నారు. తాను హిందూ మతానికి చెందిన మహిళనని అయితే జొరాస్ట్రియన్ను వివాహం చేసుకున్నట్లు చెప్పారు స్మృతీ. తన ఇద్దరు పిల్లలు జొరాస్ట్రియన్ మతంను స్వీకరించారని చెప్పారు. తన ఇద్దరు పిల్లలు ఆలయంలో ఉన్న సమయంలో తను కారులో కూర్చుని ఉంటుందని చెప్పారు. తనకు కొడుకు పుట్టిన సమయంలో అగ్ని ఆలయంకు తీసుకెళ్లామని ఆ సమయంలో పిల్లాడిని తన భర్త చేతిలో పెట్టినట్లు గుర్తుచేశారు స్మృతీ. తను ఆలయానకి దూరంగా వెళ్లి నిల్చోవాలని చెప్పారని స్మృతి వెల్లడించారు.