వేలానికి స్మృతి ఇరానీ పీఎఫ్ సర్టిఫికేట్
ఢిల్లీ : మహిళా హస్త కళాకారులకు తన వంతుసాయం అందించేందుకు ముందుకొచ్చారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. ఇందుకోసం తన ప్రావిడెంట్ ఫండ్.. పీఎఫ్ సర్టిఫికేట్ను వేలం వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎన్డీఏ 2లో మహిళా, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీ 1990ల్లో బాంద్రాలోని మెక్ డొనాల్డ్స్ ఔట్లెట్లో పనిచేశారు. క్యూ కీ సాస్ బీ కభీ బహు థీ సీరియల్లో అవకాశం రావడంతో ఆమె మెక్ డొనాల్డ్స్లో ఉద్యోగం మానేశారు. అయితే ఆ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆమె పేరిట జమ అయిన పీఎఫ్ను స్మృతి విత్ డ్రా చేసుకోలేదు.
దాదాపు మూడు దశాబ్దాల అనంతరం ముంబైకి చెందిన కాటన్ టెక్స్టైల్ ప్రమోషన్ కౌన్సిల్ సభ్యుడికి సర్టిఫికేట్ దొరికింది. స్మృతి మల్హోత్రా పేరుతో ఉన్న ఈ సర్టిఫికేట్ను ఆ శాఖ ఆమె అనుమతితో దాన్ని వేలం వేయాలని నిర్ణయించింది. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని మహిళా హస్త కళాకారుల సంక్షేమానికి వినియోగించనున్నట్లు సమాచారం.
1990లలో స్మృతి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ముంబై బాంద్రాలోని మెక్ డొనాల్డ్స్ ఔట్లెట్లో పనిచేశారు. అక్కడ టేబుళ్లు క్లీన్ చేసినందుకుగానూ ఆమెకు నెలకు రూ.1800 చెల్లించేవారని సమాచారం. ఆ తర్వాత ఆమెకు బుల్లి తెర అవకాశాలు రావడంతో ఆ ఉద్యోగం మానేసి సీరియళ్లలో బిజీ అయ్యారు.