స్మృతి డిగ్రీపై విచారణ జరపాలి: మోడీకి సోదరుడి షాక్
ఘజియాబాద్: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ డిగ్రీ పట్టాలను పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ గురువారం డిమాండ్ చేశారు. ఢిల్లీ న్యాయ శాఖ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ విద్యార్హతల విషయం నేపథ్యంలో కేంద్రమంత్రి స్మృతి విద్యార్హత పత్రాలను కూడా తనిఖీ చేయాలన్నారు.
అఖిల భారత చౌక ధరల దుకాణాల సమాఖ్య ఉపాధ్యక్ష్యుడైన ఆయన ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో విలేకరులతో మాట్లాడారు. స్మృతి ఇరానీ పట్టాల పైన దర్యాఫ్తు చేపట్టాలని ఏఏపీ, కాంగ్రెస్ పార్టీలు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి.
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీకి వీసా కోసం కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ సహకరించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ పైన పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ప్రధాని మౌనం వీడాలని డిమాండ్ చేస్తున్నారు.
దీని పైన కూడా ప్రహ్లాద్ మోడీ స్పందించారు. సుష్మా స్వరాజ్ మానవతా దృక్పథంతో లలిత్ మోడీకి సహకరించారని, దీనిని ఉద్దేశ్యపూర్వకంగా వివాదాస్పదం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. నల్ల ధనాన్ని వెనక్కి తెప్పించేందుకు కేంద్రం శాయశక్తులా కృషి చేస్తోందన్నారు.