‘భగవద్గీతను పాఠ్యాంశాల్లో చేర్చే ప్రతిపాదన లేదు’
న్యూఢిల్లీ: భగవద్గీత, వేదాలు తదితర మత గ్రంథాలను పాఠ్య ప్రణాళికల్లో చేర్చే ప్రతిపాదనేదీ పరిశీలనలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోమవారం లోక్సభకు రాతపూర్వక సమాధానమిచ్చారు.
ప్రతిపాదిత నూతన విద్యావిధానం వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని ఆమె చెప్పారు.విధాన రూపకల్పనకు వివిధ మార్గాల్లో అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి తెలిపారు.
కేంద్రీయ విద్యాలయాల్లో ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు జర్మన్ భాషను అదనపు పాఠ్యాంశంగా నేర్చుకోవచ్చని మరో ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు.
భూసేకరణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం తన నివేదికను సమర్పించడానికి గడువును పెంచుతున్నట్లు ప్రతిపక్ష సభ్యుల నిరసనల నడుమ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.
శీతాకాల సమావేశాలు ముగిసే రోజున నివేదిక సమర్పించవచ్చని చెప్పారు. దీని ప్రకారం భూసేకరణ బిల్లుపై బడ్జెట్ సమావేశాల్లోనే ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.