షర్ట్ లేకుండా ధర్నా: రాహుల్ నేర్పారా.. స్మృతి ఇరానీ నిప్పులు
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకసభ స్పీకర్ 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేశారు. దీనికి నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు.. సుష్మా ఫోటోలు చేతబట్టి, చొక్కాలు విప్పి నిరసన తెలిపారు.
దీనిపై స్మృతి ఇరానీ భగ్గుమన్నారు. ఓ స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం ఇలాగేనా అని ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని నిలదీశారు. రాహుల్ గాంధీ తన యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేర్పింది ఇదేనా అని నిలదీశారు.
కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ పైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీల విమర్శలను ఆమె తప్పుబట్టారు. సుష్మ నాటకం చేస్తున్నారన్న సోనియా వ్యాఖ్యలను తప్పుబట్టారు. పార్లమెంటు థియేటర్లా కనిపిస్తోందా అన్నారు. పార్లమెంటు ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేయవద్దన్నారు.
కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యకర్తలు లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్కు, సుష్మా స్వరాజ్కు వ్యతిరేకంగా చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. లోకసభ స్పీకర్ పార్లమెంటుకు గర్వకారణమని, అలాంటి వ్యక్తిని నిరసిస్తూ కాంగ్రెస్ అబ్బాయిలు చొక్కాలు విప్పడం సమంజసమా అని స్మృతి ప్రశ్నించారు.
మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గౌరవం ఇలాగే ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. చొక్కాలు విప్పి నిరసన వ్యక్తం చేయడం ద్వారా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని దుయ్యబట్టారు. నాగా శాంతి ఒప్పందం చరిత్రకెక్కుతుందని, దీనిని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు.