రాహుల్ పై మరోసారి స్మృతీ అస్త్రం... అసలు కథ ఏంటంటే...?
భారతీయ జనతా పార్టీ ఈ సారి లోక్సభ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయడంతో ఇక రాజకీయ రణరంగంలో అసలు సిసలైన యుద్ధం ప్రారంభమైంది. ఇక ఎప్పటిలాగానే కొన్ని స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థుల ఎంపికలో చాలా చాకచక్యంగా వ్యవహరించిన బీజేపీ... మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం క్రితం సారి అభ్యర్థులనే తమ ప్రత్యర్థులపైకి అస్త్రాలుగా వదిలింది. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అమేథీ లోక్సభ నియోజకవర్గం గురించి.
రాహుల్ పై మళ్లీ స్మృతీ ఇరానీ పోటీ
అమేథీ.... ఉత్తర్ప్రదేశ్లోని ఓ లోక్సభ నియోజకవర్గం. ఈ స్థానం ఎప్పటి నుంచో నెహ్రూ- గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంటూ వస్తోంది.ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ప్రాతినిథ్యం వహించారు. ఇక అందరికంటే ఎక్కువగా రాహుల్ గాంధీనే ఈ నియోజకవర్గం నుంచి చాలాకాలంగా ఎంపీగా ఉన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీనే ఇక్కడ ఎంపీ. 2014లో రాహుల్ గాంధీపై పోటీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీని నిలబెట్టింది బీజేపీ. అప్పుడు ఓటమి పాలైన స్మృతీ ఇరానీ తిరిగి 2019 ఎన్నికలకు కూడా ఆమెనే రాహుల్ గాంధీపై పోటీకి పెట్టారు.
బీజేపీ స్ట్రాటజీ ఏమిటి..?
గత ఎన్నికల్లో స్మృతీ ఇరానీ రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ ఈసారి కూడా ఆమెనే బరిలో నిలబెట్టడం వెనక ఆంత్యర్యం ఏమిటి..? రాహుల్ గాంధీని ఢీకొట్టే నేతలే బీజేపీలో లేరా..? ఎలాగూ స్మృతీ ఇరానీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఒకవేళ ఓడిపోయినప్పటికీ పెద్దగా ప్రభావం ఉండదు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఆమెకు మళ్లీ మంత్రి పదవి ఇస్తారు. స్మృతీ ఇరానీది కనీసం సొంత రాష్ట్రం కూడా కాదు అయినప్పటికీ బీజేపీ మాత్రం రాహుల్ గాంధీపై పోటీకి ఇరానీనే దింపింది. ఉత్తర్ప్రదేశ్లో రాజకీయ ఉద్దండులు ఉన్నప్పటికీ రాహుల్పై వారు గెలవలేరనే భావనతోనే స్మృతీ ఇరానీని కాంగ్రెస్ అధ్యక్షుడిపై పోటీకి నిలబెట్టారనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఉక్కుమనిషి రాజకీయ నిష్క్రమణ...గాంధీనగర్కు అద్వానీ దూరం
రాహుల్ది ప్రధాని స్థాయి కాదని చెప్పే ప్రయత్నం చేస్తోందా..?
ఇదిలా ఉంటే మరో వాదన కూడా వినిపిస్తోంది. నిజంగా రాహుల్ గాంధీని మట్టికరిపించాలనుకుంటే అమిత్ షాను అమేథీ నుంచి ఎందుకు పోటీ పెట్టడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంతేకాదు సొంత రాష్ట్రానికి చెందిన రాజ్నాథ్ సింగ్ లాంటి సీనియర్ నాయకుడిని రాహుల్పై ఎందుకు పోటీకి పెట్టడం లేదు అనే వాదన కూడా వినిపిస్తోంది. లేదంటే ఒక సీటును ఎందుకు వృథా చేసుకోవడం అని బీజేపీ భావిస్తోందా అనే కోణంలో కూడా ఆలోచించే స్మృతీ ఇరానీని అమేథీ నుంచి బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. ఇక రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగే బీజేపీ రాహుల్ పై ఒక మహిళను పోటీకి పెట్టి అన్నీ కలిసొస్తే ఆయనపై విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే జరిగితే రాహుల్ స్థాయి ప్రధాని స్థాయి కాదని ఒక మంత్రి స్థాయే అని ప్రజలకు చెప్పడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఒకవేళ రాహుల్ విజయం సాధించినప్పటికీ... మెజార్టీ క్రితం సారికంటే పెరగకపోతే... గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్కు ప్రజాదరణ లేదని చెప్పడమే కమలం ప్లాన్గా ఉన్నట్లు తెలుస్తోంది.
మాయావతి, అఖిలేష్ మద్దతు లేకుండా రాహుల్ గెలవలేరు: స్మృతీ
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాకా స్మృతీ ఇరానీ స్పందించారు. 2014 తనను అమేథీ నుంచి పోటీ చేయమన్నారని అది కూడా ఎన్నికలకు మూడు వారాల ముందు తన పేరును ప్రకటించారని గుర్తు చేశారు స్మృతీ ఇరానీ. అయితే రాహుల్ గాంధీ 1.70లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కేవలం మూడు వారాల్లోనే రాహుల్ మెజార్టీని దాదాపు 80శాతం తగ్గించినట్లు స్మృతీ చెప్పారు.ఇక అఖిలేష్ మాయావతిల నుంచి రాహుల్ మద్దతు కోరుతుండటం చూస్తే ఆయన సొంతంగా గెలిచే అవకాశాలు లేవని ఇక్కడే అర్థమవుతోందని స్మృతీ వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనప్పటికీ స్మృతీ ఇరానీని మరోసారి అమేథీ నుంచి పోటీకి పెట్టి రాహుల్ గాంధీని బీజేపీ ఎలా టార్గెట్ చేస్తుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వచ్చేవరకు వేచిచూడక తప్పదు.