కుంభమేళాకు దేశవిదేశాల ప్రతినిధులు... పుణ్యస్నానమాచరించిన స్మృతి ఇరానీ
అర్ధకుంభమేళా మహాక్రతువుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. మకర సంక్రాంతి నాడు మొదలయ్యే ఈ కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు వస్తుంటారు. గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తి ప్రపత్తులు చాటుతుంటారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుంభమేళా ప్రారంభమైన తొలిరోజే (మంగళవారం) ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. గంగా నదిలో పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
ప్రయాగ్రాజ్ కుంభమేళాకు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ కుంభమేళా కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశవిదేశాల నుంచి తరలివచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. వీఐపీలు, వీవీఐపీలు, ఎన్నారైల కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేసినట్లు ఇప్పటికే ప్రకటించింది. అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చిన తర్వాత జరుగుతున్న తొలి అర్ధ కుంభమేళా కావడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు ఈ కుంభమేళాను అపురూపమైన సాంస్కృతిక వారసత్వ ప్రతీకగా యునెస్కో గుర్తించడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కుంభమేళాకు 71 దేశాల ప్రతినిధులు హాజరవుతారని అంచనా. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అంతేకాదు వీరి రాక కోసం ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసింది. ఈ మార్గంలోకి ఇతర వాహనాలు రాకుండా నిషేధాజ్ఞలు కూడా విధించింది.