కాశ్మీర్ కమ్యూనికేషన్ వ్యవస్థపై కేంద్రం కీలక నిర్ణయం..
జమ్మూకాశ్మీర్లో మొబైల్ ఎస్ఎంఎస్ సర్వీసులను పునరుద్దరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నెట్ సేవలను కూడా పునరుద్దరించాలని నిర్ణయించింది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎస్ఎంఎస్,ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నెట్ సేవలు కశ్మీర్ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు అక్కడి అధికార ప్రతినిధి రోహిత్ కన్సల్ వెల్లడించారు. ఈ ఏడాది అగస్టులో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో ఇంటర్నెట్,మొబైల్ సేవలను నిలిపివేశారు. ఇటీవలే విద్యార్థులు, వ్యాపారులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. తాజాగా పూర్తి స్థాయిలో మొబైల్ ఎస్ఎంఎస్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వ ఆస్తుల విధ్వంసమే టార్గెట్: బెంగాల్ లోనూ ఇంటర్నెట్, మొబైల్ సేవల బంద్..!
మొదట ల్యాండ్ లైన్ టెలీఫోన్ సేవలు
కశ్మీర్లో మొదట ల్యాండ్ లైన్ టెలిఫోన్ సేవలను క్రమంగా పునరద్దరిస్తూ వచ్చారు. తర్వాత పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవలను పునరుద్దరించారు. ఇక ప్రీ-పెయిడ్ మొబైల్ సేవలు,ఇంటర్నెట్ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. కశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో గత వారమే ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం పునరుద్దరించింది. దాదాపు 145 రోజుల తర్వాత అక్కడ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
లఖన్పూర్ టోల్ చార్జి రద్దు..
జమ్మూకాశ్మీర్ లెవీ ఆఫ్ టోల్ యాక్ట్-1995 ప్రకారం లఖన్పూర్ పోస్ట్ వద్ద వసూలు చేస్తున్న గూడ్స్ టోల్ చార్జిను కూడా ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు రోహిత్ కన్సల్ తెలిపారు. కొత్త సంవత్సర ప్రారంభం సందర్భంగా ఈ నిర్ణయం అమలులోకి వస్తుందన్నారు. సుదీర్ఘ కాలంగా జమ్మూకాశ్మీర్ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ గూడ్స్ టోల్ చార్జి రద్దు కోసం డిమాండ్ చేస్తోందన్నారు. ఇందుకోసం ఈ ఏడాది ఆరంభంలో వారు సమ్మె కూడా చేశారని గుర్తుచేశారు.
అగస్టు నుంచి నిలిచిపోయిన సేవలు
ఈ ఏడాది అగస్టులో జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశానికి ఒకటే రాజ్యాంగం.. ఒకే జెండా ఉండాలన్న ఉద్దేశంతో కశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఆందోళనలు ఉధృతం కాకుండా కమ్యూనికేషన్ వ్యవస్థను నిలిపివేశారు. అందులో భాగంగా మొబైల్ సర్వీసులు,ఇంటర్నెట్ సర్వీసులు,ల్యాండ్ లైన్ టెలిఫోన్ సర్వీసులను నిలిపివేశారు.
ప్రస్తుతం సాధారణ పరిస్థితులు
జమ్మూకాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ధ్రువీకరించుకున్న తర్వాతే కేంద్ర ప్రభుత్వం మొబైల్,ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్దరించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇప్పటికైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించింది. అలాగే మొబైల్ ఎస్ఎంఎస్ సేవలను పునరుద్దరించింది. త్వరలోనే పూర్తి స్థాయి మొబైల్ సర్వీసులు,ఇంటర్నెట్ సర్వీసులు అక్కడ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.