కిల్లర్ వీరప్పన్ భార్య కొత్త రాజకీయ పార్టీ: తమిళనాడులో కొత్త పార్టీల పండగే పండగ!
చెన్నై: గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేశాడని, వందలాది మందిని కిరాతకంగా హత్య చేశాడని నరహంతకుడిగా పేరు తెచ్చుకున్న వీరప్పన్ కుటుంబ సభ్యులు త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారు. కిల్లర్ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నానని గురువారం ప్రకటించారు. కొత్త రాజకీయ పార్టీలతో తమిళనాడులో పండగే పండగ అన్నట్లు ఉంది.
వీరప్పన్ కూలిపని
కిల్లర్ వీరప్పన్ తమిళనాడులోని గోపినాథం అనే చిన్న గ్రామంలో 1952 జనవరి 18వ తేదీన జన్మించాడు. తరువాత స్మగ్లర్లతో చేతులు కలిపిన వీరప్పన్ కూలిపనికి వెళ్లి అడవిలో చిన్నచిన్న గంధపు చెక్కలు కత్తిరించి తెచ్చి స్మగ్లర్లకు ఇచ్చేవాడు. ఇలా ఎంతకాలం కూలి పనులు చేస్తాం అని వీరప్పన్ అలోచించాడు.
సొంత సామ్రాజ్యం
వీరప్పన్ తన సమీప బంధువులు, చుట్టుపక్కల గ్రామాల వారితో కలిసి సొంతంగా ఓ సామ్రజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. విచ్చలవిడిగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన అటవి సంపదను దోచుకున్నాడు. వందలాది ఏనుగులను చంపేసి వాటి దంతాలు విక్రయించాడు.
కర్ణాటక మంత్రి హత్య
అడ్డుపడిన పోలీసులు, అటవి శాఖ అధికారులను వీరప్పన్ అతి దారుణంగా హత్య చేశాడు. తమిళనాడు, కర్ణాటక పోలీసులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి వీరప్పన్ కోసం కొన్ని సంవత్సరాలు గాలించినా ఫలితం లేకపోయింది. కర్ణాటకకు చెందిన మంత్రిని కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశాడు.
2004 జులైలో కోవర్టు !
కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ ను చాకచక్యంగా కిడ్నాప్ చేసిన వీరప్పన్ రెండు రాష్ట్రాల ప్రజలకు కొన్ని నెలలు నిద్రలేకుండా చేశాడు. జయలలిత అధికారంలో ఉన్న సమయంలో ఎట్టకేలకు కోవర్టు ఆపరేషన్ మొదలు పెట్టిన తమిళనాడు, కర్ణాటక పోలీసులు 2004 జులై 18వ తేదీ అర్దరాత్రి పప్పారపట్టి సమీపంలో వీరప్పన్ ను ఎన్ కౌంటర్ లో అంతం చేసి ఊపిరిపీల్చుకున్నారు.
వీరప్పన్ పుట్టిన రోజు
వీరప్పన్ పుట్టిన రోజు జనవరి 18వ తేదీ ఆయన భార్య ముత్తులక్ష్మి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని సేలంలోప్రకటించారు. వీరప్పన్ పూర్తి పేరు కూసె మునిస్వామి వీరప్పన్ పేరుతో ఆయన భార్య ముత్తులక్ష్మి కొత్త రాజకీయ పార్టీ స్థాపించి రాజకీయాల్లో రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.