ప్రభుత్వ స్కూల్లో పాముకాటుతో విద్యార్థిని మృతి: సిగ్గు పడాలి, లోక్సభను కుదిపేసిన ఘటన
తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ జిల్లా సుల్తాన్ బథేరీలోని ప్రభుత్వ పాఠశాలలో పాము కరిచి విద్యార్థిని మృతి చెందిన ఘటన అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంది. ఈ ఘటన చోటు చేసుకున్న పాఠశాల తరగతి గది మొత్తాన్ని కేరళ ప్రాథమిక విద్యామంత్రిత్వ శాఖ అధికారులు కూల్చేశారు. పాము కాటు వేసిన తరువాత విద్యార్థినిని సకాలంలో ఆసుపత్రికి తరలించడంలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్ ను సస్పెండ్ చేశారు.
సుల్తాన్ బథేరీలోని సర్వజన ప్రాథమికోన్నత పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థిని షెర్లా షెర్లిన్.. తరగతి గదిలో పాము కాటు వేయడంతో మరణించిన విషయం తెలిసిందే. తరగతి గదిలో ఏర్పడ్డ రంధ్రం గుండా జొరబడ్డ పాము.. అక్కడే కూర్చుని ఉన్న షెర్లిన్ ను కాటేసింది. ఈ ఘటనలో 45 నిమిషాల తరువాత ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పాఠశాల సిబ్బంది. సకాలంలో వైద్యం అందించకపోవడంతో ఆ బాలిక మరణించారు.
సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాలు నిలిచి ఉండేవని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రధానొపాధ్యాయుడు కేకే మోహనన్, ప్రిన్సిపల్ ఏ కే కరుణాకరన్ లను కేరళ ప్రాథమిక విద్యామంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. శుక్రవారం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. పాము కరిచిన తరగతి గదిని కూల్చేయాలని ఆదేశాలను జారీ చేసింది. దీనితో కూల్చివేత పనులు ఆరంభం అయ్యాయి.
ఇదిలావుండగా.. దట్టమైన అడువులు ఉన్న ఇడుక్కి, పత్తినంథిట్ట జిల్లా కలెక్టర్లు ఈ తరహా పాఠశాలలపై దృష్టి పెట్టారు. అడవులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు. పాములు రావడానికి వీలు కల్పించే మార్గాలన్నింటినీ పూడ్చివేయాలని సూచించారు. పాములు రాకుండా కొన్ని భద్రతాపరమైన చర్యలను చేపట్టాలని పత్తినంథిట్ట జిల్లా కలెక్టర్ పీబీ నూహ్ ఆదేశించారు.
కాగా.. షెహ్లా షెర్లిన మరణించిన ఘటన ఈ ఉదయం లోక్సభలో సైతం చర్చకు వచ్చింది. రివాల్యూషనరీ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులు ఈ అంశంపై సభలో మాట్లాడటానికి ప్రయత్నించారు. దీనిపై స్పీకర్ ఓం బిర్లాకు వారు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. దీన్ని స్పీకర్ అనుమతించలేదు. ఫలితంగా ఆ పార్టీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పాము కరిచి ఓ విద్యార్థిని మృతిచెందడం సిగ్గు పడాల్సిన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు.