ఇంట్లోకి పాము వస్తే ఈ వ్యక్తి ఎవరికి ఫోన్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు
సాధారణంగా ఇంట్లోకి పాము వస్తే మన రియాక్షన్ ఎలా ఉంటుంది... భయంతో వణికిపోతాం. వెంటనే బయటకు పరుగులు తీస్తాం. తర్వాత పొరిగింటి వారిని పిలిచి విషయం చెబుతాం. కాస్త ధైర్యం ఉంటే మనమే పామును కర్రతో చితకబాదే ప్రయత్నం చేస్తాం. ఇక ఇదీ కాదంటే వెంటనే పాములు పట్టే వాడికి ఫోన్ చేస్తాం. కానీ పుదుచ్చేరిలో మాత్రం రాజా అనే వ్యాపారి ఏంచేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
పుదుచ్చేరి రాష్ట్రం అరియాంకుప్పవలో రాజా అనే వ్యాపారి తన భార్య ఇద్దరి పిల్లలతో కలిసి ఉంటున్నాడు. గత అర్ధరాత్రి వారు నిద్రిస్తుండగా ఏదో బుస కొడుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమి అయి ఉంటుందో తెలుసుకునేందుకు నిద్ర లేచి చూశారు. ఒక్కసారిగా ఐదడుగుల పాము వారికి కనిపించడంతో షాక్ అయ్యారు. వెంటనే అంతా ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. పొరిగింటి వారికి వెళ్లి చెప్పగా వారు పోలీసులకు ఫోన్ చేయమని సలహా ఇచ్చారు. పోలీసులకు ఫోన్ చేస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా చెప్పారు. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేయగా వారు ఫోన్ తీయలేదు. ఇక ఏం చేయాలో తెలియలేదు.
ఇక ఇంట్లోకి పరుగులు తీసి అక్కడే ఓ ప్రభుత్వ డైరీ కనిపించడంతో అది పట్టుకుని మళ్లీ బయటకు పరుగులు తీశాడు రాజా. డైరీ తెరవగానే మొదటిగా ఆయనకు కనిపించిన పేరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామిది. ఆయన పేరుకిందనే ఉన్న ఫోన్ నెంబరు తీసుకుని ఫోన్ చేశాడు. ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న సీఎం నారాయణ స్వామి.... ఫోన్ మోగుతుండటంతో ఫోన్ తీసి మాట్లాడారు. తన ఇంట్లోకి పాము దూరిందని భయంతో వణికిపోతున్నట్లు చెప్పారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తే ఎవరూ సరిగ్గా స్పందించడంలేదని సీఎంకు ఫిర్యాదు చేశాడు. వెంటనే నారాయణ స్వామి భయపడొద్దని ధైర్యం చెప్పి మనుషులను పంపుతానని చెప్పారు. అటవీశాఖ అధికారులకు సీఎం ఫోన్ చేయడంతో వెంటనే రాజా ఇంటికి ఇద్దరు సిబ్బంది వెళ్లి పామును పట్టుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ముఖ్యమంత్రి తనకు అర్థరాత్రి అందిన ఫిర్యాదు పై విచారణ చేశారు. అక్కడ చాలా పాము పుట్టలు ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చాడు రాజా. పాము పుట్టలను తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు సీఎం నారాయణ స్వామి. స్థానిక ఎమ్మెల్యే అనంతరామన్కు జరిగిన సంగతి గురించి చెప్పి... తానే స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షించాల్సిందిగా కోరారు.