వామ్మో కిచిడీలో పాము... చిన్నారులు తిని ఉంటే పరిస్థితి ఏమవును..?
నాందేడ్ : ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. చిన్న పిల్లల ఆరోగ్యాలు ఎవరికీ పట్టడం లేదు. వచ్చామా, మనకప్పగించిన బాధ్యతలు పూర్తి చేశామా.. త్వరగా ఇంటికి చేరుకున్నామా అన్నట్లుగానే సిబ్బంది వ్యవహరిస్తోంది. అసలు పిల్లలకు వడ్డించే భోజనం నాణ్యత ఎలా ఉంది.. ఎలాంటి ఆహారం వడ్డిస్తున్నారు.. వంట చేసే సిబ్బంది శుభ్రత పాటిస్తున్నారా లేదా అనే విషయాలేవీ ఎవరికీ పట్టడం లేదు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవానికి అది మచ్చుకైనా కనిపించడం లేదు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం ఎలా ఉంటుందో మహారాష్ట్రలోని నాందేడ్లోని ఓ పాఠశాలే ఇందుకు నిదర్శనం..
పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉన్న మధ్యాహ్న భోజన పథకం
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న గర్గావన్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కొంత మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ చిన్నారులంతా ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్నారు. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. మధ్యాహ్న భోజనం గురించి ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఆ పథకం ఎలా అమలవుతోందనేది మాత్రం విస్మరిస్తున్నాయి. దీంతో చిన్నారుల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి.
కిచిడీలో ప్రత్యక్షమైన పాము
బుధవారం రోజున గర్గావన్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో 80 మంది పిల్లలకు మధ్యాహ్న భోజనం కింద కిచిడీ వడ్డించారు. వడ్డిస్తున్న సమయంలో స్కూలు స్టాఫ్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కిచిడీ వడ్డిస్తున్న పాత్రలో పాము దర్శనమిచ్చింది. వెంటనే కిచిడీ ఉన్న పాత్రను భయంతో కిందకు వదిలేశారు. పాత్రలో కిచిడీ కనిపించిన వెంటనే వడ్డించడం ఆపివేశామని... పిల్లలు కూడా ఎవరూ తినడం ప్రారంభించలేదని నాందేడ్ విద్యాధికారి వెల్లడించారు. పిల్లలు ఆపూటకు ఆకలితోనే ఇంటికి వెళ్లారని చెప్పారు.
ఘటనపై విచారణకు ఆదేశించిన డీఈఓ
ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్పిన విద్యాధికారి ప్రశాంత్ దిగ్రాస్కర్... విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. డీఈఓ కార్యాలయం నుంచి విచారణ చేసేందుకు అధికారులు గర్గావన్ గ్రామానికి బయలుదేరి వెళ్లారని వివరించారు. నివేదిక అందగానే ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రశాంత్ వెల్లడించారు. ఇక మధ్యాహ్న భోజనం కోసం స్థానికంగా ఉన్నవారికి స్కూలు అధికారులు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు తెలిపారు.
1996లో మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కిచిడీని వారంలో ఒకరోజు వడ్డించాలనే నిబంధన తీసుకొచ్చారు. అంతేకాదు మధ్యాహ్న భోజనంతో పిల్లలు కూడా చదువుకునేందుకు ఆసక్తి కనబరుస్తారని ప్రభుత్వం చెబుతోంది. మధ్యాహ్న పథకం ద్వారా దాదాపు 1.25 కోట్ల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి.