వర్షానికి తోడు పాములు: చెన్నైవాసుల ఇక్కట్లు
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రోడ్లు, ఇళ్లు, వాహనాలు నీటిలో మునిగిపోతున్నాయి. వర్షాలకు తోడు చెన్నైవాసులకు అనుకోని అతిథులు చిక్కులు తెస్తున్నాయి.
వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇప్పటికే నగరవాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు అనుకోని అతిథులు... విషసర్పాలు, ప్రమాదకరమైన కీటకాలు, పాములు ఇళ్లలోకి చొరబడి వారికి నిద్రలేకుండా చేస్తున్నాయి.
దక్షిణ చెన్నైలోని పల్లికరణై, మాదిపక్కం, చిట్లపక్కం, ఉత్తర చెన్నైలోని వ్యాసర్పాది, కొలాథూర్లలో పాముల బెడద ఎక్కువగా ఉంది. ఇక్కడ అనేక మంది ఇళ్లలోకి విషసర్పాలు వస్తున్నాయి. దీంతో అటవీ శాఖ అధికారులకు రోజూ పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి.
సాయం చేయాలని రాజ్కు జయ ఫోన్
రాజధాని చెన్నై సహా తమిళనాడులో వర్షాలతో అతలాకుతలం అవుతోంది. వారానికి పైగా విద్యాలయాలు తెరచుకోలేదు. వంద మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. రవాణా వ్యవస్థ స్తంభించగా, జనజీవనం అస్తవ్యస్తమైంది.
ఇప్పటికే వరద సహాయక చర్యల క్రింద రూ.700 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇక కేంద్రం సాయం వైపు దృష్టి సారించారు.
గురువారం ఆమె కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితిని పూర్తిగా వివరించారు. వరదల్లో చిక్కుకున్న తమ ప్రజలకు ఆపన్న హస్తం అందించాలని కోరారు. వీలైనంత మేర ఆర్థిక సాయం చేయడమే కాక సాధ్యమైనంత త్వరలో నిధులు విడుదల చేయాలని కోరారు.