ఇంటికెళ్తుండగా స్నాప్డీల్ ఉద్యోగిని కిడ్నాప్
న్యూఢిల్లీ: దిగ్గజ ఆన్లైన్ వ్యాపార సంస్థ స్నాప్డీల్కు చెందిన ఉద్యోగినిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన విధులను ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ మేరకు స్నాప్డీల్ ఫౌండర్ కునాల్ బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా వర్గాలు సంపాదించిన వివరాల ప్రకారం.. దీప్తీ సార్నా అనే యువతి గూర్గావ్లోని స్నాప్డీల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తోంది.
Deeply disturbed by news of our @Snapdeal team member getting abducted yest. We are working closely w/ authorities to secure her safety.
— Kunal Bahl (@1kunalbahl) February 11, 2016
ఆమె ప్రతి రోజు ఆఫీసు వేళలు ముగియగానే మెట్రో రైలు ద్వారా గజియాబాద్కు వెళుతుంది. అక్కడి రైల్వే స్టేషన్ నుంచి తన ఇంటికి ఆటోలో వెళుతుంది. రోజూ మాదిరిగానే ఇంటికి వెళుతున్న దీప్తి గత రాత్రి ఇంటికి వెళ్లలేదు.
ఎక్కడ ప్రయత్నించినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో సంస్థ నిర్వాహకులే పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళా ఉద్యోగిని కిడ్నాప్ విషయం తెలియగానే కలత చెందామని, ఆమె సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు కునాల్ ట్వీట్ ద్వారా తెలియజేశారు.