స్నాప్డీల్కు ఎదురు దెబ్బ: మూర్తి రాజీనామా
ముంబై: దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్కు ఎదురుదెబ్బ తగిలింది. సంస్థ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్)గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస మూర్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంతేగాక, సొంత వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
అయితే, ఏ వ్యాపారం అన్నది ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. కొద్ది నెలల్లో తాను చేయబోయే వ్యాపారం గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తానని శ్రీనివాసమూర్తి తెలిపారు.
స్నాప్డీల్లో పనిచేసిన అనుభవంతో శ్రీనివాసమూర్తి స్వయంగా వ్యాపారవేత్త కావాలనుకుంటున్నారని, ఆయన వెళ్లిపోవడం లోటేనని స్నాప్డీల్ సహ వ్యవస్థాపకులు, సీఈవో కునాల్ బెహల్ అన్నారు.
అయినా, స్నాప్డీల్ వ్యాపార స్ఫూర్తిని ఆయన కొనసాగించడం తమకు సంతోషం కలిగిస్తోందని అన్నారు. స్నాప్డీల్ ప్రణాళికా విభాగం అధిపతిగా పనిచేసిన రంజన్ కాంత్ ఇటీవలే జబాంగ్లో చేరిన సంగతి తెలిసిందే.
అయినా, స్నాప్డీల్ సంస్థలో వ్యాపార నిపుణులకు కొదవలేదనే చెప్పాలి. దేశంలోనే కాకుండా విదేశాల్లోని వ్యాపార నిపుణులను కూడా స్నాప్డీల్ తన సంస్థలో చేర్చుకుని ఉన్నత స్థానాల్లో నియమించుకుంది.