వీడియో వైరల్ : గన్లాక్కోండి... కొట్టండి...బులంద్ షెహర్ హింసలో అల్లరిమూకలు
ఉత్తర్ ప్రదేశ్లోని బులంద్ షెహర్లో చోటుచేసుకున్న హింసలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అందులో పోలీస్ అధికారి సుబోధ్ సింగ్ కుమార్తో పాటు మరో వ్యక్తి కూడా మృతి చెందారు. అయితే అల్లర్లకు సంబంధించిన కీలక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో స్థానికుడైన ఒక వ్యక్తి సుమీత్పై తూటా ఎలాదూసుకెళ్లిందో స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు పోలీసులపై అల్లరి మూకలు రాళ్లదాడికి పాల్పడినట్లు కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
గోవధకు చేసి పొలాల్లో వేలాడదీయడంతో బులంద్షెహర్ జిల్లా మహా గ్రామంలో హింస చోటుచేసుకుంది. హిందూ యువవాహినీ, శివసేన, భజరంగ్ దళ్, కార్యకర్తలు కొందరు హింసకు పాల్పడ్డారు. ఆ గ్రామంలో గోవధకు పాల్పడ్డారని తెలుసుకుని ఘటనా స్థలంకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. గోవు మృతదేహాన్ని జాతీయ రహదారిపైకి తీసుకొచ్చి నిరసన తెలిపే క్రమంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి.
మారో మారో అంటూ కార్యకర్తలు కేకలు వేస్తూ పోలీసులపైకి రాళ్లు రువ్విన దృశ్యాలు స్పష్టంగా వీడియోలో కనిపించాయి. స్థానికుడైన సుమిత్ పై కాల్పులు జరిగాక అల్లరి మూకలు ఇన్స్పెక్టర్ వైపు పరుగులు తీసి ఆయన చేతిలో ఉన్న తుపాకీని లాక్కురండి అంటూ కేకలు వినిపిస్తున్నాయి. ఆసమయంలో ఇన్స్పెక్టర్ సుబోధ్ సింగ్ కుమార్ కింద పడిపోయారు. అంతేకాదు గాయాలపాలైన సుబోధ్ కుమార్ను పోలీసులు జీపులో ఆస్పత్రికి తరలిస్తుండగా జీపుపై దాడి చేసిన వీడియో కూడా బటయకొచ్చింది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే కేసును విచారణ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ సిట్ ఈ వీడియోలను కూడా పరిశీలించనుంది. మరోవైపు ఈ హింసాత్మక ఘటనలో మృతి చెందిన ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ కుటుంబాన్ని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పరామర్శించారు. ఇప్పటికే కుటుంబ సభ్యులకు పరిహారం ప్రకటించారు.