‘నువ్విప్పుడు కృష్ణుడివయ్యావా?’: బీహార్ మంత్రిపై మోడీ జోక్
ప్రధాని నరేంద్ర మోడీ పాట్నాలో భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత రాష్ట్ర సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర మంత్రులతో జరిగిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ పాట్నాలో భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత రాష్ట్ర సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర మంత్రులతో జరిగిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విందులో లాలూ తనయులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ వారితో సరదాగా ముచ్చటించారు.
'నువ్విప్పుడు కృష్ణుడివి అయిపోయావా?' అంటూ బీహార్ ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ప్రతాప్ యాదవ్తో మోడీ జోక్ చేశారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. అనంతరం కొందరు నేతలు.. మీరిన్ని విషయాలు ఎలా గుర్తుపెట్టుకుంటారు' అని ప్రధానిని అడిగారు.
కాగా, కొద్దిరోజుల క్రితం తేజ్ ప్రతాప్ యాదవ్ శ్రీకృష్ణ జన్మస్థలం అయిన మధురను దర్శించుకున్నారు. ఆ సమయంలో పిల్లన గ్రోవిని పట్టుకుని గోవుల మధ్య గోపాలుడుగా దిగిన ఫొటో సోషల్మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇదే విషయాన్ని మోడీ ప్రస్తావిస్తూ ఈ సందర్భంగా జోక్ చేశారు. కాగా, అంతకుముందు గురుగోవింద్సింగ్ 350వ జయంతిని పురస్కరించుకుని పాట్నాలో గురువారం పెద్ద ఎత్తున నిర్వహించిన వేడుకల్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. .