పెట్రో ధరల ఎఫెక్ట్: బైక్ అమ్మి గుర్రాన్ని కొనుగోలు చేసిన పాల వ్యాపారి
ముంబై: పెరిగిన పెట్రోలు ధరలతో ఓ పాల వ్యాపారి తన బైక్ను అమ్మేసి ఓ గుర్రాన్ని కొనుగోలు చేశాడు. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో పాల వ్యాపారి ఈ మార్గాన్ని ఎంచుకొన్నాడు.
అంతర్జాతీయంగా ముడిచమురు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో పెట్రోల్, డీజీల్ ధరలు విపరీతంగా పెరిగాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కూడ పన్నులు వేస్తున్నాయి. ఈ తరుణంలో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
ముంబైలోని పాలను సరఫరా చేసే పాండురంగ్ అనే వ్యక్తి తన బైక్ ను రూ. 22వేలకు విక్రయించాడు. ప్రతిరోజూ సుమారు 7 కిలోమీటర్లదూరం బైక్ పై తిరిగి పాలు విక్రయిస్తాడు.
అయితే పెట్రోల్ ధరలు పెరగడం వల్ల అతనికి రోజుకూ పెట్రోల్ ఖర్చులకే రూ.200 చెల్లించాల్సి వస్తోంది. దీంతో పెట్రోల్ కొనుగోలుకు తన లాభమంతా వెచ్చించాల్సిన పరిస్తితులు నెలకొన్నాయి.దీంతో పాండురంగ్ బైక్ ను విక్రయించాడు
బైక్ను విక్రయించి గుర్రాన్ని కొనుగోలు చేశాడు. ఈ గుర్రంపై ప్రతి రోజూ తిరిగి పాలను విక్రయిస్తున్నాడు. బైక్ కంటే గుర్రంపై వెళ్ళి పాలు విక్రయించడం వల్ల తనకు ఖర్చు తక్కువ అవుతోందని పాండురంగ్ చెప్పారు.
ప్రతి వారం గుర్రం నిర్వహణ కోసం కేవలం రూ.50 ఖర్చు చేయాల్సి వచ్చిందని పాండురంగ్ చెప్పారు. పాండురంగ్ తండ్రి కూడ పాలను విక్రయించి జీవనం సాగించేవాడు. తండ్రి తర్వాత పాండురంగ్ కూడ ఇదే వృత్తిని ఎంచుకొన్నాడు.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.24కు చేరింది. దీంతో పాండురంగ్ తన బైక్ ను విక్రయించాడు. భార్య, పిల్లలతో పాటు తల్లిని కూడ పాలను విక్రయం ద్వారా వచ్చే ఆదాయంతోనే పాండురంగ్ పోషిస్తున్నాడు. ఈ కారణంగానే తగన బైక్ ను విక్రయించినట్టు చెప్పారు.