శబరిమల అయ్యప్ప ఆలయంకు ఇక వెళ్లేది లేదన్న సామాజిక కార్యకర్త బిందు..ఎందుకంటే..?
కోజికోడ్: ఇకపై తాను శబరిమలకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు సామాజిక కార్యకర్త బిందు అమ్మిని. సంఘ్ పరివార్ కార్యకర్తలు తనను బెదిరిస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు అంతకుముందు వెళ్లానని అయితే పోలీసులు తనకు న్యాయం చేయలేకపోతున్నారని ఆమె చెప్పారు.శబరిమలకు వస్తే తనను కాల్చేస్తానని సంఘ్పరివార్ నేత దిలీప్ వేణుగోపాల్ బెదిరిస్తున్నారని చెప్పారు. కోయిలంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదని పైగా పతనంతిట్టా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారని బిందు వెల్లడించారు.
డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోవడం లేదని .... శబరిమలకు వచ్చే వారికి పోలీసులు రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని అన్నారు.
తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై కోయిలంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బిందు చెప్పారు. ఫిర్యాదు ఇచ్చి కూడా ఏడాదిన్నర అవుతున్నప్పటికీ ఇంకా ఎవరినీ పోలీసులు అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బిందు.ఇక తనకు రక్షణ కల్పించకపోవడంతో పోలసులపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. తనను చంపేస్తానని బెదిరించిన దిలీప్ వేణుగోపాల్ను పోలీసులు అరెస్టు చేయకపోతే న్యాయం కోసం సత్యాగ్రహం చేపడుతానని అదికూడా కోయిలంది పోలీస్ స్టేషన్ ఎదురుగానే వచ్చే శనివారం రోజున దీక్ష చేపడతానని స్పష్టం చేశారు బిందు.
ఏడాది క్రితం అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయంను దర్శించుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో బిందు అమ్మిని అనే సామాజిక కార్యకర్త శబరిమల అయ్యప్పస్వామి ఆలయంను సందర్శించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అయితే ఆమెపై హిందు సంఘాలు దాడి చేశారు. నాడు బిందుపై పెప్పర్ స్ప్రే, కారంపొడి చల్లారు. ఈ దృశ్యాలను కొన్ని టీవీ ఛానెల్స్ కూడా ప్రసారం చేశాయి. పోలీస్ కమిషనరేట్ బయట ఆమెపై కారంపొడితో దాడి చేయడం జరిగింది.