కరోనా లాక్డౌన్: నిన్న మహారాష్ట్ర ఎమ్మెల్యే, నేడు జార్ఖండ్ ఎమ్మెల్యే, సోషల్ డిస్టన్స్ పాటించని నేతలు
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుంటే బాధ్యతగా ఉండాల్సిన కొందరు ప్రజాప్రతినిధులు నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలో దాదారావు కెచే అనే బీజేపీ ఎమ్మెల్యే తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసే సమయంలో సామాజిక దూరం పాటించలేదు. ఇప్పుడు జార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే వంతు వచ్చింది. పేదలకు ఆహార ప్యాకెట్లు ఇచ్చే సమయంలో ఈ నేత కూడా సోషల్ డిస్టన్స్ పాటించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
నో సోషల్ డిస్టన్స్..
జార్ఖండ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఒక్కరోజే 13 పాజిటివ్ నమోదవడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. కానీ దాన్బాద్కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సిన్హా మాత్రం లాక్డౌన్ నిబంధనలను ఖాతరు చేయలేదు. జార్ఖండ్ మైదానంలో పేదలకు ఆహార పొట్లలు అందజేస్తామని చెప్పారు. ఇంకేముంది జనం గుమిగూడారు. కరోనా వైరస్ ఎక్కడ వ్యాపిస్తుందోనని భయపడుతుంటే.. ఎమ్మెల్యే మాత్రం ప్రజలను పిలిచి ఆహార పొట్లలు అందజేసి.. తాను చేసిన సేవను క్యాష్ చేసుకున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సరికాదు..
ఆహార ప్యాకెట్లు పంచే సమయంలో సామాజిక దూరం పాటించకపోవడంపై మండిపడ్డారు. ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న నేతలు బాధ్యతగా ఉండాలని సూచిస్తున్నారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి అజయ్ రాయ్ స్పందించారు. తమ నేత తప్పు చేశారని.. దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. పనిలోపనిగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై ఆరోపణలు గుప్పించారు. అతను చాలా సందర్భాల్లో సామాజిక దూరం పాటించలేదని గుర్తుచేశారు. అధికారులతో కూడా చాలా దగ్గరగా ఉన్నారని.. మొహానికి కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదని చెప్పారు.
చర్యలు తప్పవు..
ఘటనపై కలెక్టర్ రాజ్ మహేశ్వర్ రియాక్టయ్యారు. సామాజిక దూరం పాటించని వారిపై చర్యలు తప్పవన్నారు. వారిపై చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అయితే ఘటన తర్వాత ఎమ్మెల్యే రాజ్ సిన్హా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు.