సోషల్ మీడియా ఎఫెక్ట్ .. కరోనా వచ్చిందన్న భయం .. లేఖ రాసి మరీ ఉరేసుకున్న వ్యక్తి
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు . దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకు షట్ డౌన్ కొనసాగనుంది . ఇక కరోనా వైరస్ పైన జాగ్రత్తల మాట అటుంచి కరోనా వైరస్ పై మాత్రం ప్రజల్లో రోజురోజుకు భయం పెరిగిపోతోంది. ఎవరు తుమ్మినా దగ్గినా కరోనా వైరస్ అన్న భయం ప్రజలను వేధిస్తోంది.
సోషల్ మీడియా వదంతులతో ఒక వ్యక్తి సూసైడ్
ఇక సోషల్ మీడియాలో కరోనా ఎలా వస్తుంది ? ఎలా వ్యాప్తి చెందుతుంది ? అని జరుగుతున్న ప్రచారం ప్రజలను టెన్షన్ పెడుతుంది. ఎవరికీ తోచింది వారు రాస్తూ వదంతులు ప్రచారం చెయ్యటంతో అవి చూసి నమ్మిన వారు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా వైరస్పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను చూసి నిజమే అనుకుని కర్ణాటకకు చెందిన గోపాల కృష్ణ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కర్ణాటక ఆర్టీసీ ఎంప్లాయ్ కి కరోనా భయం
తనకు కరోనా వైరస్ సోకిందని భావించిన ఆయన ఇంట్లో ఎవరూ ఊహించని విధంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు .కర్ణాటక రాష్ట్రానికి చెందిన గోపాలకృష్ణ ఉడిపి జిల్లా బ్రహ్మవర తాలూక ఉప్పూర్ గ్రామంలో నివసిస్తున్నాడు. ఆయన కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణ సంస్ధలో పనిచేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావద్దని చెప్పిన నేపధ్యంలో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు.
తనకు కరోనా ఉందని లేఖ రాసి ఆత్మహత్య
ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ తన నివాసంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు గోపాల కృష్ణ . తనకు కరోనా వైరస్ సోకిందని, తన కుటుంబం సురక్షితంగా ఉండాలని కోరుతూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సోషల్ మీడియాలో కరోనావైరస్ గురించి బాగా ఎక్కువగా చదివిన ఆయన అందులో ఉన్న లక్షణాలు అన్నీ తనకు ఉన్నాయని ఆపాదించుకున్నారు. దీంతో గోపాల కృష్ణ మానసికంగా ఇబ్బంది పడి ప్రాణం తీసుకున్నారు.
కరోనాపై వదంతులే కారణం .. సోషల్ మీడియా వల్లే భయంతో ఆత్మహత్య
ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు రోజు రాత్రి కరోనా వైరస్ గురించి తమతో మాట్లాడాడని, వాస్తవానికి ఆయనకు కరోనా సోకలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. లేనిపోని అనుమానంతో ప్రాణం తీసుకున్నారని లబో దిబోమంటున్నారు . ఇలాంటి భయాలు, ఘటనలు పెరగకుండా సోషల్ మీడియా మీద ఆంక్షలు విధించారు. వదంతులు ప్రచారం చెయ్యొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివల్ల అనవసరపు భయాలు పెరుగుతాయని అంటున్నారు. ఇక ఎవరైనా సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు .