ఎలక్షన్ కమీషన్ కూ సోషల్ మీడియా ఎఫెక్ట్ .. అసత్య వార్తలపై సీరియస్ .. తొలగింపుకు చర్యలు
సోషల్ మీడియా తో ఎలక్షన్ కమీషన్ కు తిప్పలు తప్పడం లేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఫేక్ న్యూస్ ఎలక్షన్ కమీషన్ కూ తలనొప్పిగా మారింది. ఎలక్షన్ కమీషన్ తీసుకోని నిర్ణయాలను కూడా ఆ కమీషన్ తాజా నిర్ణయాలుగా చెబుతూ తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతో చర్యలకు ఉపక్రమించింది ఎలక్షన్ కమీషన్.
ఎన్నారైలకు ఆన్లైన్ లో ఓటింగ్ ఫెసిలిటీ.. ఈసీ పై తప్పుడు ప్రచారం
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నారైలు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించిందని, ఆన్ లైన్లో ఓటేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుందని కొద్దిరోజులుగా ఫేస్ బుక్ - ట్విటర్ - వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారమవుతున్నాయి. కానీ ఇది నిజం కాదని పేర్కొంది .ఎలక్షన్ కమీషన్ ఇప్పటివరకు అటువంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు. దీనికి సంబందించిన ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా చాలామంది ఇలాంటి తప్పుడు వార్తలు సందేశాల రూపంలో ఎవరైనా పంపిస్తే వాటిలోవాస్తవమెంతో తెలుసుకోకుండా యథాతథంగా ఫార్వార్డ్ చేస్తున్నారు. దీంతో ఈ అసత్య కథనాలు బాగా ప్రచారమవుతున్నాయి.
రంగంలోకి దిగిన ఎలక్షన్ కమీషన్.. చర్యలకు ఉప క్రమణ
ఏకంగా ఎలక్షన్ కమీషన్ మీద ఇలాంటి ప్రచారం జరగడంతో ఈ సంగతి గుర్తించిన ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారంలోకి తేవడం వల్ల ప్రజల్లో అయోమయం ఏర్పడుతుందని.. ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని పేర్కొంటూ ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసింది. ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ లేఖలో కోరుతూ ఫిర్యాదు చేసింది.
ట్విట్టర్ వాట్సాప్ లలో ఈ ఫేక్ న్యూస్ తొలగించాలని ఆదేశం
అంతేకాకుండా ట్విటర్, వాట్సప్ కంపెనీలను ఈ విషయంలో ఎన్నికల సంఘం సంప్రదించింది. ఈ తప్పుడు ప్రచారానికి సంబంధించిన పోస్టులు, సందేశాలను తొలగించాలని ఆ రెండు సంస్థలను కోరింది. ఈసీ లోగోను అనుమతి లేకుండా వినియోగించుకుంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నవారి విషయంలో చర్యలు తీసుకోవాలని.. సత్వరమే ఈ విషయంలో దర్యాప్తు చేసి దోషులను పట్టుకోవాలని ఈసీ ఢిల్లీ పోలీసులను కోరింది. మొత్తానికి వారు, వీరు అన్న తేడా లేకుండా ఎలక్షన్ కమీషన్ తో సహా అందరూ సోషల్ మీడియా తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.