జీతాలు ఇవ్వలేదని సాఫ్ట్ వేర్ కంపెనీ ఎండీని కిడ్నాప్ చేసిన టెక్కీలు, విషం సేవించి!
బెంగళూరు: సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని జీతాలు ఇవ్వలేదని అతన్ని అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న టెక్కీలు కిడ్నాప్ చేసిన విచిత్ర సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. జీతాలు త్వరలో ఇస్తానని ఉద్యోగులను నమ్మించిన సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని చివరికి విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు.
బెంగళూరు నగరంలోని హలసూరు సమీపంలో సుజయ్ అనే వ్యక్తి ఇన్ఫోటెక్ సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇన్ఫో టెక్ కంపెనీలో అనేక మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఉద్యోగం చేస్తున్నారు. గత మూడు నెలల నుంచి సుజయ్ కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని సమాచారం.
ఈ విషయంలో కొందరు సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులు సుజయ్ మీద కక్ష పెంచుకున్నారు. జీతాలు చెల్లించే విషయంలో మీతో మాట్లాడాలని సుజయ్ ని అతని కంపెనీ ఉద్యోగులు పిలిపించారు. సుజయ్ తో మాట్లాడిన ఉద్యోగులు అతన్ని బెంగళూరులో కిడ్నాప్ చేసి మండ్య జిల్లా మద్దూరుకు తీసుకెళ్లారు.
మద్దూరు సమీపంలోని ఒక ఫాం హౌస్ లో సుజయ్ ను నిర్బందించారు. మీ అందరి జీతాలు త్వరలో ఇస్తానని, నన్ను నమ్మాలని సుజయ్ మనవి చెయ్యడంతో అతన్ని ఉద్యోగులు వదిలిపెట్టారు. ఇంటికి చేరుకున్న సుజయ్ విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు.
విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు సుజయ్ ను ఆసుపత్రికి తరలించారు. సుజయ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుజయ్ మాయం కావడంతో పోలీసులకు మరో తలనొప్పి తయారైయ్యింది. కేసు విచారణలో ఉందని, మాయం అయిన సుజయ్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.