ఇన్ఫోసిస్ లేడీ టెక్కీ స్వాతి దారుణ హత్య కేసు క్లోజ్
చెన్నై: ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న మహిళా టెక్కీ స్వాతి (25) హత్య కేసును న్యాయస్థానం పూర్తిగా క్లోజ్ చేసింది. హత్య చేసిన నిందితుడు ప్రాణాలతో లేనందున ఇక ఈ కేసు విచారణ చేసినా ప్రయోజనం లేదని పోలీసులు నివేదిక సమర్పించారు.
చెన్నైలోని సూలైమేడు ప్రాంతంలోని గంగై వీధిలో నివాసం ఉంటున్న స్వాతి ఇన్ఫోసిస్ లో ఉద్యోగిని. ఎప్పటిలాగే ఆమె తండ్రి 2016 ఆగస్టు 5వ తేదిన ఉదయం 7 గంటలకు స్వాతిని బైక్ లో తీసుకువచ్చి నుంగంబాకమ్ రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టి వెళ్లారు.
ఉద్యోగానికి వెళ్లడానికి రైలు కోసం ఎదురు చూస్తున్న స్వాతిని రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాం మీద కత్తితో అతి దారుణంగా దాడి చేసి హత్య చేసి పరారైనాడు. ఈ కేసులో పోలీసులు నెలై జిల్లా మీనాక్షిపురం ప్రాంతానికి చెందిన రాంకుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు పంపించి విచారణ చేపట్టారు.
అయితే జైలులో ఉన్న రాంకుమార్ విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కేసు విచారణలోనే ఉంది. తమిళనాడులో సంచలనం రేపిన స్వాతి హత్య కేసులో నిందితుడు రాంకుమార్ ప్రాణాలతో లేనికారణంగా కేసు మూసివేస్తున్నామని మంగళవారం ఎగ్మూరు కోర్టు తీర్పు చెప్పింది.