11 అదనం: ఆ విద్యార్థికి 100కు 101మార్కులొచ్చాయి
అహ్మదాబాద్: ఏ విద్యార్థి అయినా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవచ్చు. కానీ 100కు 101 మార్కులు సాధించడం సాధ్యమేనా? అయితే, సాఫ్టువేర్లోని పొరపాటు కారణంగా గుజరాత్లో పన్నెండో తరగతిలో ఓ విద్యార్థికి వందకు నూటా ఒక్క మార్కులు వచ్చాయి.
గుజరాత్ వెళ్లి గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులో ఇది జరిగింది. ఇంటర్ పరీక్షల్లో ఓ విద్యార్థి 100 మార్కులకు పరీక్ష రాస్తే అతనికి 101 మార్కులు వచ్చాయి. సాంకేతిక కారణాలతోనే ఇలా జరిగిందని, తప్పు సరిదిద్దుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జరిగిన నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. ఇందుకు కారణమైన వారికి నోటీసులు ఇచ్చామని, పరీక్షా పేపర్లు దిద్దిన ఔట్ సోర్సింగ్ ఏజన్సీదే తప్పని అధికారులు తెలిపారు. దీనిని సీరియస్గా తీసుకున్నామన్నారు. రాయాల్సిన సమాధానాల కన్నా, అధికంగా రాసిన ఓ విద్యార్థి వాస్తవానికి 90 మార్కులు తెచ్చుకుంటే, కంప్యూటర్ తప్పిదం కారణంగా 101 మార్కులు వచ్చాయని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
ఔట్ సోర్సింగ్ ఏజన్సీ ఉపయోగించిన సాఫ్టువేర్ విద్యార్థికి 11 మార్కులు అధికంగా వేసిందన్నారు. ఇలాగే ఎవరికైనా ఎక్కువ మార్కులు వచ్చాయా? అన్న విషయమై పరిశీలిస్తున్నామన్నారు. ఈ ఘటన తర్వాత గుజరాత్ టెక్నాలజీ యూనివర్శిటీకి చెందిన శ్రీ కంప్యూటర్స్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టును రద్దు చేశామన్నారు.