సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు: తీర్పుపై స్టే ఇవ్వాలంటూ మహిళ బాంబే హెకోర్టులో పిటిషన్
సోహ్రాబుద్దీన్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును ఇవ్వనున్న నేపథ్యంలో ఈ కేసులో సాక్షిగా ఉన్న ఒక మహిళ రిజ్వానా ఖాన్ స్టేకోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని కోరారు. 2005 నవంబర్లో సోహ్రాబుద్దీన్ ఆయన భార్య కౌసర్బీని బూటకపు ఎన్కౌంటర్లో గుజరాత్ రాజస్థాన్ పోలీసులు చంపేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తయ్యింది ఇక తీర్పును డిసెంబర్ 21కి రిజర్వ్ చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.
అందరి స్టేట్మెంట్ రికార్డు చేయలేదు
సీబీఐ కోర్టు తీర్పుపై స్టే విధించాలని బాంబే హైకోర్టును ఆశ్రయించింది కేసులో సాక్ష్యంగా ఉన్న రిజ్వానా ఖాన్. ఈ కేసుతో సంబంధం ఉన్న చాలా మందిని విచారణ చేయకుండానే విచారణాధికారులు ఎంక్వైరీని ముగించేశారని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. సంబంధిత వ్యక్తుల సాక్షాలను నమోదు చేయకపోతే కేసు బలహీనపడుతుందని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఛార్జ్షీటులో 500 మందికి పైగా పేర్లు ఉన్నాయని చివరిగా 210 మంది స్టేట్మెంట్లు మాత్రమే రికార్డ్ అయ్యాయని ఆమె ఆరోపించారు. ఇందులో 92 మంది విరుద్ధంగా మారారని తెలిపారు. అందరిని విచారణ చేసి వారి స్టేట్మెంట్ రికార్డు అయ్యేవరకు తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా కోరారు.
నా భర్త స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలి
బూటకపు ఎన్కౌంటర్ కేసులో సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో స్టే విధించాలని తన భర్త అజామ్ ఖాన్ తరపున తను పిటిషన్ దాఖలు చేసినట్లు రిజ్వానా ఖాన్ తెలిపింది. తన భర్త కూడా ఈ కేసులో సాక్షిగా ఉన్నారని చెప్పింది. అంతేకాదు తన కుటుంబాన్ని మొత్తం బెదిరించడం జరిగిందని ఆమె వెల్లడించారు. నవంబర్ 3న అజామ్ఖాన్ కోర్టు ముందు హాజరై తాను కూడా సోహ్రాబుద్దీన్ గ్యాంగులో సభ్యుడిగా ఉన్నట్లు చెప్పారు. తులసీరాం ప్రజాపతిని 2006లో చంపారని అది కూడా బూటకపు ఎన్కౌంటరే అని చెప్పారు. ప్రజాపతి సోహ్రాబుద్దీన్ ఆదేశాల మేరకు 2003లో గుజరాత్ హోంమంత్రిని హత్యచేశాడు. దీంతో ఆ గ్యాంగ్ను తాను వీడినట్లు అజాం ఖాన్ వెల్లడించాడు.
పెద్దల ఒత్తిడి మేరకే నాడు సోహ్రాబుద్దీన్ను చంపేశారు
అభయ్ చుడాసమా అనే వ్యక్తి సోహ్రాబుద్దీన్ ద్వారా డిసెంబర్ 2004లో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల హత్యకు కుట్రచేశారని రిజ్వానా ఖాన్ చెప్పింది. అభయ్ చుడాసామాను వ్యతిరేకించడంతో నాటి డీజీ వంజారా ఇతర ఉన్నతాధికారులు, రాజకీయనాయకులు, గుజరాత్ రాజస్థాన్ పోలీసులు కలిసి సోహ్రాబుద్దీన్ను బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని ఆరోపించింది. గుజరాత్లోని ప్రభుత్వ పెద్దలు, రాజస్థాన్ హోంమంత్రి నుంచి ఒత్తిడి రావడంతో వారు సోహ్రాబుద్దీన్ను హత్య చేశారని ఆరోపించారు. అంతేకాదు తన భర్త ఆజాం ఖాన్ను కోర్టుకు తీసుకురాక ముందు 20 రోజుల పాటు ఉదయ్ పూర్ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని వెల్లడించింది.
కోర్టు రక్షణ కల్పించడంతో ధైర్యంగా స్టేట్ మెంట్ ఇస్తాడు: రిజ్వానా ఖాన్
ఇదిలా ఉంటే సోహ్రబుద్దీన్, ప్రజాపతిల హత్య బూటకపు ఎన్కౌంటరే అని అజాం ఖాన్ చెప్పాడు. అయితే ఈ కేసులో సాక్షిగా ఉన్న తన భర్త అజాం ఖాన్ స్టేట్మెంట్ కూడా కోర్టు సమక్షంలో రికార్డు చేయాలని రిజ్వానా ఖాన్ తన పిటిషన్లో కోరింది. ప్రస్తుతం ఉదయ్పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తన భర్త అజాం ఖాన్ కోర్టులో అసలు నిజం చెప్పేందుకు ముందుకొచ్చాడని పిటిషన్లో తెలిపింది. రాజస్థాన్ హైకోర్టు రక్షణ కల్పిస్తామని చెప్పడంతోనే ఆయన అసలు నిజం బయటకు చెప్పేందుకు ధైర్యం చేశారని రిజ్వానా ఖాన్ తెలిపింది.