ఆది నుంచి ముందంజ.. షిండే కూతురుకు చుక్కలు.. షోలాపూర్ ఎన్నికల్లో తెలుగోడి సత్తా..!
ముంబై : మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగోడి సత్తా కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబానికి చుక్కలు చూపించారు. షోలాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన తెలుగు వ్యక్తి ఎన్నికల ఫలితాల్లో ఆది నుంచి ఆధిక్యం కనబరిచారు. ఈ సెగ్మెంట్లో షిండే కూతురు ప్రణితి సుశీల్ కుమార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వాస్తవానికి షోలాపూర్ సెగ్మెంట్ షిండే కుటుంబానికి కంచుకోట లాంటిది. అలాంటిది తెలుగువాడైన కొతే మహేశ్ విష్ణుపంత్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆమెకు సవాల్గా మారారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగోడి సత్తా.. విజయం అంచుల దాకా..!
గురువారం (24.10.2019) నాడు వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో షిండే ప్రణితి సుశీల్ కుమార్ విజయం సాధించారు. ఆమెకు 48 వేల 832 ఓట్లు పోలయ్యాయి. 36 వేల 889 ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి హజీ ఫరూఖ్ మక్బూల్ శబ్ది రెండో స్థానంలో నిలిచారు. అయితే తెలుగువాడైన మహేశ్ 29 వేల 526 ఓట్లు సాధించి మూడో స్థానం దక్కించుకున్నారు. ఇక శివసేన అభ్యర్థి దిలీప్ బ్రహ్మదేవ్ మానే 27 వేల 340 ఓట్లు సాధించడం గమనార్హం. ఇతను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల వేళ శివసేన పార్టీలో చేరారు. వాస్తవానికి షోలాపూర్ శివసేన జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన మహేశ్కు ఆ పార్టీ టికెట్ దక్కాల్సి ఉంది. చివరిక్షణంలో దిలీప్ మానే శివసేనలో చేరడంతో ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చారు.
సీఎం కుర్చీ 50-50.. బీజేపీతోనే ప్రభుత్వం.. శివసేన ఫార్ములా.. 29 ఏళ్లకే ముఖ్యమంత్రా?
కౌంటింగ్ ప్రారంభంలో మహేశ్ ఆధిక్యం.. చివరకు..!
అయితే ఈ ఎన్నికల్లో తెలుగువాడైన మహేశ్ కేవలం 19 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి చాలా రౌండ్ల వరకు మహేశ్ ఆధిక్యం కనబరిచారు. దాంతో షిండే కుటుంబ సభ్యుల గుండెల్లో బాంబులు పేలినంత పనైంది. ఒక దశలో ఈయన గెలుస్తారని.. ఆమె ఓడిపోవడం ఖాయమనే రీతిలో కౌంటింగ్ సరళి కనిపించింది. చివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షిండే ప్రణితి సుశీల్ కుమార్ విజయం సాధించారు.
శివసేన టికెట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా విజయం దక్కేది..!
తెలుగు ప్రజలు దాదాపు 60 శాతం మేర నివసించే షోలాపూర్లో శివసేన టికెట్ ఇచ్చి ఉంటే కచ్చితంగా మహేశ్ గెలిచేవారు. శివసేన అభ్యర్థిగా చివరిదాకా ఆయన పేరే వినిపించింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి దిలీప్ మానే జంప్ కావడం.. ఆయన శివసేన పార్టీలో చేరడం.. ఇదంతా కూడా మహేశ్కు శివసేన టికెట్ దక్కకుండా చేసింది. దాంతో ఆయన విజయావకాశాలు చేజారాయి. ఒకవేళ శివసేన టికెట్ మహేశ్కు ఇచ్చి ఉంటే ఆ పార్టీ ఖాతాలో మరో ఎమ్మెల్యే చేరేవారు.
ఈ విజయం టానిక్.. బాధ్యత పెరిగింది.. హుజుర్నగర్ ప్రజలను కలుస్తా : సీఎం కేసీఆర్
రాజకీయ కుట్రలకు బలి..!
మూడో స్థానంలో నిలిచిన మహేశ్కు రాజకీయ కుట్రకు బలయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. షిండే కుటుంబ సభ్యులు చేసిన కుట్ర కారణంగానే ఆయనకు పార్టీ టికెట్ దక్కలేదనే ప్రచారం జరుగుతోంది. తెలుగు ప్రజలు 60 శాతం వరకు ఉండే షోలాపూర్లో ఆయన శివసేన అభ్యర్థిగా పోటీ చేసి ఉంటే గెలుపు ఆయన సొంతమయ్యేదని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. శివసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 27,340 కాగా రెబెల్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మహేశ్కు 29,526 ఓట్లు పోలయ్యాయి. ఈ ఇద్దరి ఓట్లు కలిపితే 56 వేల పైచిలుకు మాటే. అంటే ఆయన శివసేన అభ్యర్థిగా పోటీ చేస్తే బ్రహ్మండమైన మెజార్టీతో షిండే ప్రణితి సుశీల్ కుమార్పై విజయం సాధించేవారు.