కేరళ సీఎంకు ఊరట: అసలేంటీ ఈ సోలార్ స్కాం?
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి హైకోర్టులో ఊరట లభించింది. సోలార్ కుంభకోణంలో ఉమెన్ చాందీపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని త్రిశూర్ విజిలెన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ హైకోర్టు శుక్రవారం రెండు నెలల పాటు స్టే విధించింది.
సీఎంతో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అరయదాన్ మహ్మద్పై సోలార్ కుంభకోణంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ విజిలెన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు నిలుపుదల చేసింది. విజిలెన్స్ కోర్టు తన అధికారాల విస్తృతి, కేసు తీరు గురించి తెలుసుకోకుండా తీర్పు వెల్లడించిందని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
ప్రైవేట్ సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతించేందుకు సీఎం ఊమెన్ చాందీకి తాము భారీ మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు టీమ్ సోలార్ కంపెనీ యజమాని సరితా నాయర్ ఆరోపణలు చేసింది. దీంతో ఈ కేసులో సీఎంపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని కేరళ విజిలెన్స్ కోర్టు ఆదేశించింది.
అసలు ఏంటీ సోలార్ కుంభకోణం:
2013లో టీమ్ సోలార్ అనే కంపెనీ తక్కువ ధరలకు సోలార్ ప్యానల్స్ ఇస్తామని కేరళలో ప్రచారం నిర్వహించింది. ఈ కంపనీ యజమానులే సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్. అయితే వీరిద్దరూ దంపతులు కావడం విశేషం. సీఎం కార్యాలయ సిబ్బంది ఇతర మంత్రుల కార్యదర్శుల అండదండలతో భారీ ఎత్తున ప్రజల నుంచి నిధులు సేకరించారు.
ఆ తర్వాత సోలార్ ప్యానల్స్ అమర్చారు. ఈ సోలార్ ప్యానల్స్ అమరికపై ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్లతో పాటు సీఎం వద్ద కార్యదర్శిగా పనిచేసిన టెన్నీజొప్పన్, సినీ నటి షాలు మేనన్లను పోలీసులు అరెస్టుచేశారు.
ఆ తర్వాత ఈ సోలార్ కుంభకోణంపై న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో 2013 నుంచి జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు సరితా నాయర్ జస్టిస్ శివరాజన్ కమిషన్ ముందు బుధవారం విచారణకు హాజరై తాను సీఎం చాందీ సన్నిహితుడికి రూ. 1.90 కోట్లు, విద్యుత్ శాఖ మంత్రికి రూ. 40 లక్షలు లంచం ఇచ్చినట్లు వాంగ్మూలమిచ్చారు.
2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 140 స్థానాల్లో యూడీఎఫ్కు 72 ఎల్డీఎఫ్కు 68 స్థానాలు లభించాయి. యూడీఎఫ్లో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉమెన్ చాందీ సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతక ముందు 2004 నుంచి 2006 వరకు ఆయన సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
పీకల్లోతు అవినీతి ఊబిలో చిక్కుకున్న ఉమెన్ చాందీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యూడీఎఫ్ కూటమిలోని కీలక భాగస్వామిగా ఉన్న ఆర్ఎస్పీ ఎమ్మెల్యే కొవూర్ కుంజుమొన్, మరో మంత్రి బాబు తమ పదవులకు ఇటీవలే రాజీనామాలు చేశారు. వీరిపై పలు అవినీతి ఆరోపణలు రావడంతో పదవుల నుంచి తప్పుకున్నారు.
అయితే తాజాగా సీఎంపైనే అవినీతి ఆరోపణలు రావడంతో ఉమెన్ చాందీకి వ్యతిరేకంగా విపక్షాలు శుక్రవారం కూడా ఆందోళన నిర్వహించాయి. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు కేరళ సచివాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
మరోవైపు డీవైఎఫ్ఐ నాయకులు సైతం ఇదే డిమాండ్తో ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది ఇలా ఉంటే ఉమెన్ చాందీ తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు వచ్చిన తప్పుడు ఆరోపణలతో పదవి నుంచి తప్పుకునే ప్రసక్తి లేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమైతే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. లిక్కర్ లాబీ తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందన్నారు.