హాట్ కేకుల్లా దావూద్ ఆస్తులు!: 4 కోట్లకు హోటల్
ముంబై: అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ముంబైలోని పలు ఆస్తులు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయి. ముంబైలో దావూద్కు చెందిన మొత్తం 7 ఆస్తులను బుధవారం వేలంపాట నిర్వహించిన సంగతి తెలిసిందే. దావూద్.. 1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత దేశం విడిచి పారిపోయాడు.
అతడు ప్రస్తుతం పాకిస్థాన్లో తలదాచుకుంటున్నాడు. అయితే ముంబై దాడుల తర్వాత అతడికి చెందిన ఓ హోటల్ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ‘రౌనక్ అఫ్రోజ్' హోటల్ను ఒకప్పటి జర్నలిస్ట్, ప్రస్తుత ఉద్యమకారుడు బాలక్రిష్ణన్ దక్కించుకున్నారు. రూ.1.18 కోట్ల ప్రారంభ ధరతో వేలానికి వచ్చిన ఈ హోటల్ కోసం ఆయన ఏకంగా రూ.4.28 కోట్లను వెచ్చించేందుకు ముందుకు వచ్చారు.
ఈ హోటల్ కోసం దాఖలైన బిడ్లలో అత్యధిక ధరను ఇదే కావడంతో బాలక్రిష్ణన్, దావూద్ ఇబ్రహీంకు చెందిన హోటల్ను దక్కించుకున్నారు. ఈ వేలంపాటలో దావూద్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు గాను ఢిల్లీకి చెందిన లాయర్ అజయ్ శ్రీవాత్సవలతో పాటు హిందూ మహాసభ అధ్యక్షులు స్వామి చక్రపాణి కూడా బిడ్ వేశారు.
ఇక, దావూద్ గతంలో వాడినట్లుగా భావిస్తున్న హ్యుందై యాక్సెంట్ కారును హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి రూ.3.32 లక్షలు వెచ్చించి కొనుక్కున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దావూద్ ఇబ్రహీం కారును తగులబెట్టేందుకే దానిని తాను సొంతం చేసుకున్నానని తెలిపారు.
మాతుంగ ప్రాంతానికి చెందిన మహావీర్ బిల్డింగ్లో దావూద్కు చెందిన 32.77 చదరపు మీటర్లున్న గదికి ప్రారంభ ధరగా రూ.50.44 లక్షలను నిర్ణయించగా, సదరు గది కూడా వేలంలో అమ్ముడుబోయింది. కాగా, స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్ల చట్టం- 1976ను అనుసరించి ఈ వేలం పాటను నిర్వహించారు. ఇందుకోసం ఒక ప్రయివేటు సంస్థను ప్రభుత్వం నియమించింది.