నాలుగో పెళ్లికి సిద్దం అయిన సైనికుడు, మొదటి భార్య ఎంట్రీ, తాళి కట్టే ముందు అరెస్టు, జైల్లో !
అమ్మాయిలను మోసం చేస్తూ వరుసగా పెళ్లి చేసుకుంటున్న నిత్యపెళ్లి కొడుకును కర్ణాటకలోని మైసూరు నగరంలోని విజయనగర పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
మైసూరు: అమ్మాయిలను మోసం చేస్తూ వరుసగా పెళ్లి చేసుకుంటున్న నిత్యపెళ్లి కొడుకును కర్ణాటకలోని మైసూరు నగరంలోని విజయనగర పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో సైనికుడిగా పని చేస్తున్న శివనంజప్ప అలియాస్ శివనంజ (36) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
Recommended Video
కర్ణాటకలోని కేఆర్ నగర తాలుకా సాలిగ్రామానికి చెందిన శివనంజప్ప జమ్మూ కాశ్మీర్ లో సైనికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను 2007లో సాలిగ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతిని వెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్బంతి కావడంతో పుట్టింటికి పంపించాడు.
ముగ్గురు భార్యలు
వరలక్ష్మికి వరకట్నం వేధింపులకు గురి చేసిన శివనంజప్ప విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో విడాకుల కేసు విచారణలో ఉంది. తరువాత సాలిగ్రామానికి చెందిన మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమెకు దూరం అయిన శివనంజప్ప కేఆర్ నగర కనగాలు గ్రామానికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
జమ్మూ కాశ్మీర్ కు జంప్
మూడో భార్యను దూరం పెట్టిన శివనంజప్ప జమ్మూ కాశ్మీర్ వెళ్లిపోయాడు. ఇటీవల సెలవుల మీద సొంత గ్రామానికి వచ్చిన శివనంజప్ప మైసూరు నగరంలో నివాసం ఉంటున్న పాల వ్యాపారికి మాయమాటలు చెప్పి ఆయన కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు.
ఉదయం పెళ్లి
ఆదివారం రాత్రి మైసూరులోని విజయనగర్ లోని శ్రీ యోగనరసింహస్వామి దేవాలయంలో నిశ్చితార్థం జరిగింది. సోమవారం పెళ్లి చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న శివనంజప్ప మొదటి భార్య వరలక్ష్మి తన పెళ్లి ఫోటోలు తీసుకుని శ్రీ యోగనరసింహ స్వామి దేవాలయం చేరుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన యువతికి ఇచ్చింది.
పెళ్లి కాదు దేహశుద్ది చేశారు
విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయిన శివనంజప్పకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. శివనంజప్పను అరెస్టు చేశామని, అతని ముగ్గురు భార్యలను పిలిపించి విచారణ చేస్తున్నామని విజయనగర పోలీసులు తెలిపారు.
సెలవుల్లో వచ్చి పెళ్లి చేసుకుంటాడు
సైనికుడిగా పని చేస్తున్న శివనంజప్ప సెలవుల మీద వచ్చినప్పుడు అమ్మాయిలను చూడటం, పెళ్లి చేసుకుని మోసం చెయ్యడం సర్వసాధారంగా మారింది. శివనంజప్ప కట్నం కోసం, అమ్మాయిలను అనుభవించాలన్న ఆశతో ఇలా నిత్య పెళ్లి కుమారుడిగా మారాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.