మన సైనికులెవరూ చనిపోలేదు: భారత సైన్యం, పాక్ మీడియా అసత్య ప్రచారం
న్యూఢిల్లీ: నియంత్రణరేఖ వద్ద జరిగిన ఇరుపక్షాల కాల్పుల్లో ఎనిమిదిమంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోగా, ఒక జవాను ప్రాణాలతో పట్టుబడినట్లు పాకిస్థాన్ మీడియాలో వచ్చిన వార్తలను భారత సైనిక వర్గాలు గురువారం ఖండించాయి. అవి నిరాధార కథనాలని, అవాస్తవాలని స్పష్టం చేసింది.
పాకిస్థాన్కు చెందిన డాన్ పత్రికలో వచ్చిన వార్తలపై భారత సైనికవర్గాలు గురువారం స్పందిస్తూ... రాష్ట్రీయ రైఫిల్స్కు చెందిన 37మంది భద్రతా దళంలోని ఓ సైనికుడు అనుకోకుండా సరిహద్దు దాటాడని, అయితే భారత్ కు చెందిన సైనికులెవరూ పాక్ చేతిలో చంపడలేదని స్పష్టం చేశారు.
ఆజాద్ కాశ్మీర్(పాక్ ఆక్రమిత కాశ్మీర్)లోని పూంచ్ జిల్లా టట్టాపానీ వద్ద ఉన్న నియంత్రణరేఖ వద్ద భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన కాల్పుల్లో ఎనిమిదిమంది భారత సైనికులు, ఇద్దరు పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, ఒక భారతీయ జవానును పాక్ దళాలు ప్రాణాలతో పట్టుకున్నాయని డాన్ వెబ్సైట్ తొలుత వెల్లడించింది.
పాక్కు సజీవంగా పట్టుబడింది మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల ఆ సైనికుడు చందూబాబూలాల్ చౌహాన్ అని పేర్కొంది. కాగా, ఈ వార్తలను పాకిస్థాన్ సైన్యం ధ్రువీకరించలేదు. మరోవైపు, తన కథనాన్ని గురువారం రాత్రి డాన్ పత్రిక తమ వెబ్సైట్ నుంచి తొలగించింది.
దీనిపై భారత సైనికవర్గాలు గురువారం రాత్రి స్పందించారు. ఒక భారత సైనికుడు తన ఆయుధాన్ని తీసుకొని అనుకోకుండా నియంత్రణరేఖ (ఎల్ఓసీ)ను దాటుకొని (పాక్వైపు) వెళ్లారని, ఈ విషయాన్ని పాక్సైన్యానికి తెలియజేశామని వెల్లడించాయి. ఈ విధంగా అనుకోకుండా సరిహద్దులు దాటిన వారిని వెనక్కి పంపించిన ఘటనలు గతంలో కూడా ఇరువైపుల నుంచి జరిగాయని గుర్తుచేసింది.
కాగా, భారత సైన్యం బుధవారం రాత్రి సరిహద్దు దాటి జరిపిన సర్జికల్ దాడుల్లో సుమారు 40మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఏడుగురిని సజీవం పట్టుకున్నట్లు భారత సైనికాధికారులు తెలిపిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ మాత్రం భారత సర్జికల్ దాడులు జరగలేదని చెప్పుకుంటుండటం గమనార్హం.