జవాన్ల మధ్య తీవ్ర ఘర్షణ: కాల్పులు, ఒకరి మృతి
మాల్దా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా బిఎస్ఎఫ్ క్యాంపులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏడుగురు జవాన్ల మధ్య మొదలైన చిన్న గొడవ తీవ్ర ఘర్షణ దారితీసింది. ఈ ఘర్షణలో ఒక జవాను మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంలో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాల్పులకు పాల్పడిన బసంత్ సింగ్ అనే కానిస్టేబుల్ అక్కడ్నుంచి పరారయ్యాడు.
సోమవారం రాత్రి జరిగిన ఘర్షణ కారణంగా మంగళవారం ఉదయం బసంత్ సింగ్ జరిపిన కాల్పుల్లో మూల్చంద్ అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. బసంత్ సింగ్ వద్ద ఆయుధం లేకపోవడంతో మరో జవాను వద్ద నుంచి తీసుకొని మూల్చంద్పై కాల్పులు జరిపినట్లు సమాచారం.
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని గోలికోట్ నుంచి ఇండోర్ వస్తున్న ప్రైవేటు బస్సు జబువా ప్రాంతంలో లోయలో పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో 40 మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ధార్ మరియు జబువా జిల్లాల నుండి సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.