గాల్వాన్లో భయానక నిశబ్దం.. రగిలిపోతోన్న భారత శిబిరాలు.. మోదీ సర్కార్ నిద్రపోతోందంటూ..
కొందరి శరీరాల్లో ఎక్కడపడితే అక్కడ ఇనుప మేకులు దించారు.. ఇంకొందరిని ఊపిరాడకుండా చేశారు.. మరికొందరిని వందల అడుగుల లోయలోకి తోసేశారు.. చైనా కిరాతక దాడిలో చనిపోయిన జవాన్లలో కొందరి మృతదేహాలు ముక్కలైపోయి ఉండటం అందరినీ కలచివేస్తున్నది. మనవాళ్లను చైనా సైనికులు ఎంత దారుణంగా చంపేశారో ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్నకొద్దీ సరిహద్దులోని శిబిరాల్లో అంతకంతకూ ఆగ్రహావేశాలు పెల్లుబికుతోన్నాయి..
Recommended Video
షాకింగ్: చైనా ఖైదులో భారత జవాన్లు.. చర్చలతో 10 మంది విడుదల.. డ్రాగన్ లక్ష్యం నెరవేరినట్లేనా?
రాక్షసులే నయం..
వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి కీలకమైన ప్రాంతాలను కబ్జా చేయడమ టార్గెట్ గా చైనా సైన్యం గత నెలన్నరగా కవ్వింపు చర్యలకు దిగడం, సోమవారం గాల్వాన్ లోయలో నిరాయుధులైన భారత సైన్యాలపై దాడి చేయడం తెలిసిందే. అయితే, ఆ ఘటనలో చైనా ఊహకందనంత క్రూరంగా, రాక్షసులే నయం అనుకునేంత స్థాయిలో పాశవికాన్ని ప్రదర్శించినట్లు వెల్లడైంది. చనిపోయిన 20 మంది జవాన్లలో కొందరి మృతదేహాలు ముక్కలైపోయి ఉన్నాయిని తేలింది. దీంతో..
పట్టలేని ఆగ్రహం..
గాల్వాన్ లోయలో చైనా కిరాతకం తర్వాత భారత సైనికుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబిగుతున్నాయని, తుపాను ముందు ప్రశాంతత మాదిరిగా సరిహద్దు వెంబడి శిబిరాల్లో భయానక నిశబ్ద వాతావరణం నెలకొన్నట్లు తెలిసింది. ప్రధానంగా గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సుకు సమీపంలోని శిబిరాల్లో సైనికుల ఆవేశాన్ని కట్టడి చేయడానికి పై అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని, గడిచిన మూడు రోజులుగా తూర్పు లదాక్ అంతటా గంభీర పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం.
కొనసాగుతోన్న చర్చలు..
భారత జవాన్లను దారుణంగా హత్య చేయడంతోపాటు పదుల మందిని గాయపర్చిన చైనా.. ఇంకొందరిని బందీలుగా తీసుకుంది. వాళ్ల విడుదల కోసం 3వ ఇన్ఫంట్రీ డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ అభిజిత్ బాపత్ నేతృత్వంలోని బృందం.. చైనాతో జరిపిన చర్చలు ఫలించాయి. ఇద్దరు మేజర్ స్థాయి అధికారులు సహా మొత్తం 10 మంది భారతీయుల్ని చైనా విడుదల చేసినట్లు ఆర్మీ ప్రకటించిది. అయితే, సరిహద్దులో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేలా రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి..
తాడో పేడో తేలుతుందా?
సైనికులను హతమార్చడమేకాకుండా.. గాల్వాన్ లోయపై సార్వభౌమత్వాన్ని సైతం ప్రకటించుకున్న చైనాను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో.. లదాక్ లో ఏం జరుగుతున్నదో పార్టీలకు బ్రీఫింగ్ ఇవ్వనున్న కేంద్రం.. తదుపరి చర్చలపై సమాలోచనలు జరుపనున్నది. చైనాను సైనిక మార్గంలోనే ఎదుర్కోవాల? లేక ఆర్థిక, రాజకీయ పరంగా కట్టడి చేయాలా అనేదానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
ఇప్పుడు స్పష్టమయ్యాయి..
తూర్పు లడఖ్లో ఉద్రిక్త పరిస్థితులపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన కామెంట్లు చేశారు. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలతో.. గాల్వన్లో చైనా ప్లాన్ ప్రకారమే దాడిచేసిందని, భారత ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోయిందని, ఫలితంగా వీర జవాన్లను కోల్పోవాల్సి వచ్చినట్లు స్పష్టంగా అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ముందస్తు ప్రణాలికతోనే చైనా దాడికి పాల్పడిందన్న రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ వ్యాఖ్యలను రాహుల్ ట్విటర్ లో షేర్ చేశారు.