రెండుగా చీలిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ, నువ్వానేనా, మాజీ సీఎంకు చెక్!
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద కాంగ్రెస్ పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం మరోసారి విరుచుకుపడింది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే సిద్దరామయ్య వర్గం ఉండాలి, లేదా మేము ఉండాలి అంటూ కాంగ్రెస్ పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం హైకమాండ్ కు పరోక్షంగా హెచ్చరించింది. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయం ముందు సిద్దరామయ్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీని కాపాడే బుద్దిని ప్రసాదించు దేవుడా అనే ఫ్లక్సీలు ఏర్పాటు చేసి మాజీ సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి సిద్దరామయ్య వర్గమే కారణం అని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తున్నది.
మోడీ మీద నమ్మకం ఉంది, నేను ప్రజల ఎంపీని, ఆ పార్టీ మనిషిని కాదు, సుమలత !
ఏకం అయిన సీనియర్లు
కేంద్ర మాజీ మంత్రి కేహెచ్. మునియప్ప, బీకే. హరిప్రసాద్ తదితరులు మాజీ సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా మౌనంగా ధర్నా నిర్వహించారు. కర్ణాటక శాసన సభలో ప్రతిపక్ష నాయకుడి పదవిని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ కు లేదా హెచ్.కే. పాటిల్ కు ఇవ్వాలని హైకమాండ్ కు మనవి చేశారు. అయితే కొందరు నాయకులు మాజీ సీఎం సిద్దరామయ్యకు ప్రతిపక్ష నాయకుడి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు మనవి చేశారు.
హైకమాండ్ కు ఫిర్యాదు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్త్రీ బెంగళూరు చేరుకుని యార్డిసన్ హోటల్ లో బస చేశారు. మధుసూదన్ మిస్త్రీని సిద్దరామయ్య వర్గీయులు, ఆయన వ్యతిరేక వర్గీయులు భేటీ అయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల నాయకులు మధుసూదన్ మిస్త్రీని కలిసి ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
63 మంది నాయకులు
కర్ణాటకలోని 22 మంది ఎమ్మెల్యేలు, 28 మంది మాజీ పీఎంపీలు, ఆరు మంది ఎమ్మెల్సీలతో పాటు 63 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హధుసూదన్ మిస్త్రీని కలిసి వారి అభిప్రయాలు వ్యక్తం చేశారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడి పదవితో పాటు వివిద పదవులు ఎవరెవరికి ఇవ్వాలి అనే అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలను మధుసూదన్ మిస్త్రీ సేకరించారు.
కీలక పదవి
కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించిన ఆ పార్టీ హైకమాండ్ త్వరలో ప్రతిపక్ష నాయకుడి పదవి ఎవరికి ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. వీలైనంత త్వరగా రెండు మూడు రోజుల్లో ప్రతిపక్ష నాయకుడి పదవి ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ నిర్ణయించిందని తెలిసింది.
ఢిల్లీలో రెండు వర్గాలు మకాం
కర్ణాటక కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలను రెండు వర్గాలు భేటీ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడి పదవికి సిద్దరామయ్య ఇవ్వాలని ఆయన వర్గం, మా వర్గానికి ఇవ్వాలని సిద్దరామయ్య వ్యతిక వర్గం ఢిల్లీ పెద్దలకు మనవి చేస్తున్నాయి. మొత్తం మీద సిద్దరామయ్య వ్యతిరేక వర్గం మరోసారి తెరమీదకు రావడంతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది.