సీఎం సిద్దూకు ఓటు వెయ్యండి, లేదంటే ఉద్యోగాలు ఊడిపోతాయి, చాముండేశ్వరిలో ఒత్తిడి, జేడీఎస్!
మైసూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఓటు వెయ్యకుంటే మీ ఉద్యోగాలు ఊడిపొతాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను బెదిరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక శాసన సభ్యుడి కుమారుడు, పోలీసులు జోక్యం చేసుకుని జేడీఎస్ కార్యకర్తలకు నచ్చ చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
కార్పొరేటర్ ఒత్తిడి
మైసూరు నగర పాలికే కార్పొరేటర్ జగదీష్ తదితరులు శనివారం చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్యకు ఓటు వెయ్యాలని పారిశుద్ద కార్మికుల మీద ఒత్తిడి తీసుకువచ్చారు. సీఎం సిద్దరామయ్యకు వ్యతిరేకంగా స్థానిక శాసన సభ్యుడు జీటీ. దేవేగౌడకు మద్దతుగా ఓటు వేస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయని కార్పొరేటర్ జగదీష్ పారిశుద్ద కార్మికులను హెచ్చరించారని సమాచారం.
కాంగ్రెస్, జేడీఎస్ ఢీ
విషయం తెలుసుకున్న జేడీఎస్ కార్యకర్తలు జగదీష్ కు ఎదురుతిరిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు గుమికూడటంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. గొడవ జరుగుతున్న విషయం తెలుసుకున్న స్థానిక జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ. దేవేగౌడ కుమారుడు హరీష్ గౌడ సంఘటనా స్థలానికి చేరుకున్నాడు.
ఎమ్మెల్యే కొడుకు
జేడీఎస్ కార్యకర్తలకు నచ్చచెప్పి మనకు గొడవలు వద్దని, ప్రజలు ఎవరికి ఓటు వెయ్యాలనుకుంటే వారికి ఓటు వేస్తారని జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ. దేవేగౌడ కుమారుడు హరీష్ గౌడ సర్ది చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా నినాదాలు చెయ్యడంతో జేడీఎస్ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే జీటీ. దేవేగౌడకు మద్దుతుగా నినాదాలు చేశారు.
సిద్దూకు ఓటమి భయం
చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య ఓడిపోతారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. చాముండేశ్వరి నియోజక వర్గంలో సీఎం సిద్దరామయ్య ఓడిపోతారని ఇంటిలిజెన్స్ నివేదిక ఇచ్చిందని ప్రచారం జరిగింది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా సీఎం సిద్దరామయ్య ఓటమి భయంతో బాదామిలో కూడా పోటీ చేస్తున్నారని సమాచారం.