మోడీని మళ్లీ ప్రధానిగా చూడాలనుకోవడం లేదు: కొంతమందిపై కేంద్రమంత్రి
పాట్నా/న్యూఢిల్లీ: ఎన్డీయేలోని కొంతమంది నేతలు నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానమంత్రిగా చూడాలనుకోవడం లేదని కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వా శుక్రవారం అన్నారు. ఈ విషయంపై తాను ఇంతకు మించి మాట్లాడనని చెప్పారు. ఎన్డీయేలో కొంతమంది సర్దుకుపోలేకపోతున్నారని అన్నారు.
ఇటీవల ఓ బీజేపీ నేత బీహార్ పొత్తుపైమాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 40 స్థానాలకు సీట్ల కేటాయింపు జరిగిపోయిందన్నారు. బీజేపీకే అధికంగా 20 సీట్లు కేటాయించారని అన్నారు.
అంతేకాదు, నితీశ్ కుమార్కు చెందిన జేడీయూకు పన్నెండు, రామ్ విలాస్ పాశ్వాన్ ఎల్జేపీ ఐదు, ఉపేంద్ర కుష్వాకు చెందిన ఆర్ఎల్ఎస్పీకు రెండు, ఆర్ఎల్ఎస్పీతో చీలిపోయి స్థాపించిన పార్టీలకు ఒక సీటు కేటాయించారన్నారు.
దీనిపై ఉపేంద్ర కుష్వ మాట్లాడారు. ఈ వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఇంకా సీట్ల కేటాయింపు జరగలేదని ఇలాంటి వార్తలను ప్రచారం చేసే వారు ఎన్డీయేలో విభేదాలను సృష్టించడానికే అన్నారు.
కాగా,వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్డీయే పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకాలపై చాలా రోజులుగా చర్చలు సాగుతున్నాయి. బీహార్లో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. 20 -20 ఫార్ములాతో బీజేపీ జేడీయు ముందు ప్రతిపాదన పెట్టింది. దీని పట్ల జేడీయూ అసంతృప్తితో ఉంది.
సమాచారం మేరకు బీజేపీ ఇరవై సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మిగతా ఇరవై స్థానాల్లో 12 జేడీయూ, 6 రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జనశక్తి పార్టీ, రెండు ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎస్ఎల్పీకి ఇస్తామని ప్రతిపాదన చేస్తోంది. బీజేపీకి 20, ఇతర పార్టీలకు ఇరవై అని చెబుతోంది. దీనిపై జేడీయూ అసంతృప్తితో ఉంది.