ఎన్ఆర్సీ అమలు చేస్తే రాష్ట్రాలను సంప్రదిస్తాం: ఎన్పీఆర్ డేటాపై రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ: జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)పై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్సీని అమలు చేయాలనుకుంటే ప్రభుత్వం అందుకు తగిన ప్రక్రియను అనుసరిస్తుందని చెప్పారు. ఒకవేళ అలాంటి నిర్ణయమేదైనా తీసుకోదలిస్తే ముందుగా రాష్ట్రాలను సంప్రదిస్తుందని తెలిపారు.
ఆదివారం ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్ఆర్సీ చేపట్టాల్సి వస్తే దాన్ని నిగూఢంగా ఉంచాల్సిన అవసరం లేదని అన్నారు. అందుకు చట్టపరంగా కొన్ని ప్రక్రియలు ఉన్నాయని తెలిపారు.
ముందు నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయడం, ప్రక్రియ ప్రారంభించడం, పరిశీలించడం, అభ్యంతరాలు స్వీకరించడం, వాటిని విచారించడం, అప్పీల్ చేసుకునే హక్కు ఇవ్వడం వంటివి అందులో ఉంటాయని రవిశంకర్ ప్రసాద్ వివరించారు.
ముఖ్యంగా అలాంటిదేమైనా చేయాల్సి వస్తే రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. ఏది చేసినా బహిరంగంగానే చేస్తామే తప్ప దాయాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి చెప్పారు. అంతేగాక, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్) ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎన్ఆర్సీ కోసం ఉపయోగించవచ్చు లేదంటే ఉపయోగించకపోవచ్చని ఆయన తెలిపారు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పూర్తిగా న్యాయబద్దమైనదని, రాజ్యాంగ బద్ధమైనదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కాగా, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్కి మధ్య ఎలాంటి సంబంధం లేదని, అవి రెండు వేరని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్పీఆర్ ద్వారా కేవలం వివరాలు మాత్రమే సేకరిస్తారని తెలిపారు. ఇందుకు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని చెప్పారు.