అన్నా, కేజ్రీవాల్ ఫైట్: వికె సింగ్ వ్యాఖ్య, అన్నా ఫైర్
రాలేగావ్ సిద్ధి (మహారాష్ట్ర): సామాజిక కార్యకర్త అన్నా హజారేకు, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్కు మధ్య విభేదాలు బయటపడ్డాయి. గత నాలుగు రోజులుగా తాను దీక్ష చేస్తున్న వేదిక నుంచి వెళ్లిపోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్ని హజారే ఆదేశించారు. హజారేకు సన్నిహితుడు, మాజీ ఆర్మీ చీఫ్ వికె సింగ్తో రాయ్ వాగ్వివాదానికి దిగడంతో అన్నా ఆగ్రహించారు.
ఒకరు ప్రసంగిస్తున్నప్పుడు నువ్వు మాట్లాడడం సరికాదని, గొడవ సృష్టించడానికి బదులు ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిదని అన్నా హజారే రాయ్తో చెప్పారు. వికె సింగ్ ప్రసంగిస్తూ పరోక్షంగా ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేశారు. హజారే కన్నా తాము పెద్దవాళ్లమని కొంత మంది అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
వికె సింగ్కు ఆ తర్వాత రాయ్ సమాధానం ఇచ్చారు. నరేంద్ర మోడీతో చేతులు కలపడానికి వికె సింగ్ అన్నాను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అన్నా హజారే ర్యాలీ నుంచి వెనక్కి రావాలని ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం రాయ్ను ఆదేశించినట్లు సమాచారం. జన్ లోక్పాల్ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ అన్నా హాజరే దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, మరో వివాదం కూడా ముందుకు వచ్చింది. అర్వింద్ కేజ్రీవాల్పై ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ న్యాయ శాఖ మంత్రి శాంతి భూషన్ ఆర్టికల్ రాశారనే విషయంపై వివాదం చెలరేగుతోంది. తాను అటువంటి ఆర్టికల్ ఏదీ రాయలేదని, మెయిల్ టుడేపై దావా వేస్తానని శాంతిభూషణ్ అన్నారు. ఆ విషయాన్ని తాను పరిశీలిస్తున్నట్లు మెయిల్ టుడే సంపాదకుడు సందీప్ బంజాయ్ జాతీయ మీడియా సంప్రదిస్తే చెప్పారు.