నన్ను చంపేందుకు కుట్ర పన్నారు: మమత సంచలనం
కోల్కత్తా: తనను చంపేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఓ రాజకీయ పార్టీ తనను చంపేందుకు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చిందన్నారు. ఇంటలిజెన్స్ అధికారులు ఈ విషయమై తనను ప్రభుత్వ బంగళాలోకి మారాలని కోరినట్టు ఆమె చెప్పారు.
సుపారీ తీసుకొన్న కిరాయి హంతకులు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని ఆమె చెప్పారు. ఖచ్చితమైన సమాచారాన్ని తాను వెల్లడిస్తున్నట్టు ఆమె చెప్పారు. కాంగ్రెస్, బిజెపి, సీపీఎంలు ప్రధాన సమస్యలను వదిలేసి తనను విమర్శించడమే పనిగా పెట్టుకొన్నాయని ఆమె ఆరోపించారు.
దేశంలో 12 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆమె చెప్పారు. మత ఘర్షణలు పెట్రేగిపోయాయన్నారు. ఈ విషయమై కాంగ్రెస్, సీపీఎంలు కనీసం నిరసన కూడ తెలపలేదన్నారు.
దేశంలో అశాంతిని బిజెపి ప్రేరేపిస్తోందన్నారు. రామనవమిని గతంలో జరుపుకొన్న సందర్భాలున్నాయన్నారు. కానీ ఏనాడూ కూడ ఆయుధాలు చేపట్టలేదని మమత బెనర్జీ చెప్పారు. కర్ణాటకలో ఫలితాలు హంగ్ అసెంబ్లీ దిశగా ఉంటాయన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓడిపోవడం ఖాయమన్నారు..