కొందరు సిట్టింగుల సీట్లు గల్లంతు.. కొత్తవారికి ఛాన్స్... అభ్యర్థులను ప్రకటించనున్న బీజేపీ
మహారాష్ట్ర, హర్యానాకు అభ్యర్థుల కసరత్తుపై బీజేపీ దృష్టిసారించింది. ఇవాళ అభ్యర్థులను ప్రకటించనుంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని విశ్వసనీయంగా తెలిసింది. దీంతోపాటు మహారాష్ట్రతో సీట్ల కేటాయింపుపై కూడా బీజేపీ ప్రకటించే అవకాశం ఉంది.
సీట్ల కేటాయింపు
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ, శివసేన మెజార్టీ సీట్లలో పోటీ చేయాలని భావించడంతో పొత్తుల చర్చలు ముందుకుసాగలేదు. చివరికి బీజేపీ 144, శివసేన 126 సీట్లకు పోటీ చేయాలని ప్రతిపాదన కూడా వచ్చింది. మిగతా భాగస్వామ్య పక్షాలకు 18 సీట్లు ఇస్తామని బీజేపీ ఇండికేషన్స్ ఇచ్చింది. దీంతోపాటు శివసేన డిప్యూటీ సీఎం పదవీ ఇస్తామని, బీజేపీ సీఎం పదవీ ప్రస్తుత సీఎం ఫడ్నవీస్కు దక్కుతుందని చర్చలు సాగినట్టు ఊహాగానాలు వినిపించాయి.
2014లో విడిగా
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తులు ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగింది. కానీ 2014లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగాయి. తర్వాత పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులకు టికెట్లు ఇవ్వబోమని బీజేపీ హైకమాండ్ తేల్చిచెప్పింది. కానీ హర్యానాలో కేంద్రమంత్రి రావు ఇంద్రిజిత్ సింగ్ తన కూతురి కోసం టికెట్ అడుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
టికెట్ అడగొద్దు
మరోవైపు 75 ఏళ్లు దాటినవారికి పార్టీ టికెట్ ఇవ్వబోమని ఇప్పటికే బీజేపీ పార్లమెంటరీ పార్టీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీ పార్టీ విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసిన సమాచారం ప్రకారం.. మహారాష్ట్ర, హర్యానాలో కొందరు సిట్టింగులకు సీటు దక్కకపోవచ్చని తెలుస్తోంది. కొత్తగా మాజీ ఇండియా హాకీ కెప్టెన్ సందీప్ సింగ్, ఒలింపిక్ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మహిళా రెజ్లర్ బబితా ఫోగట్ ఇటీవలే బీజేపీలో చేరారు. వీరికి తప్పకుండా బీజేపీ టికెట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.