అద్దెకు భారీ వినాయకుడి విగ్రహాలు, ఆశ తీరింది, డబ్బు మిగిలింది, ట్రెండ్ సెట్ చేశారు!
Recommended Video
బెంగళూరు: వినాయక చవితి పండుగ సందర్బంగా వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేసి తరువాత ఊరేంగిపుగా తీసుకెళ్లి జై గణేష్ మహారాజ్ కి జై అంటూ నీళ్లలో నిమజ్జనం చేస్తుంటారు. అయితే ట్రెండ్ మారింది. వినాయుడిని ప్రతిష్టించి పూజలు, పునస్కారాలు చేసిన తరువాత ఊరేగింపుగా తీసుకెళ్లి అంగడిలో వాపస్ ఇస్తున్నారు. బెంగళూరులో అద్దె వినాయకుడి విగ్రహాలకు మంచి డిమాండ్ వచ్చింది. బెంగళూరులో ఈ కొత్త ట్రెండ్ సెట్ చేశారు.
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 5 ఎకరాలు రూ. 1 కోటి, అదే డీకే కొంప ముంచింది, బినామి !
భారీ వినాయకుడి విగ్రహాలు
వినాయకుడి విగ్రహాలు విక్రయించడం మనం చూస్తుంటాం. బెంగళూరులోని లాల్ బాగ్ వెస్ట్ గేట్ నుంచి జేసీ రోడ్డుకు వెళ్లే మార్గంలోని వినాయక అండ్ కంపెనీ నిర్వహకులు వినాయకుడి విగ్రహాలు అద్దెకు ఇస్తున్నారు. 18 అడుగుల ఎత్తు నుంచి అతి పెద్ద వినాయుకుడి విగ్రహాలను ఇక్కడ అద్దెకు ఇస్తున్నారు.
రూ. లక్షల విలువైన విగ్రహాలు
వినాయకుడి విగ్రహాలను యువకులు పోటాపోటీగా పెట్టడం మనం చూస్తుంటాం. లక్షల రూపాయలు ఖర్చు చేసి వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించి తరువాత నీళ్లలో నిమజ్జనం చేస్తుంటారు. అయితే రూ. లక్షల విలువైన విగ్రహాలను వినాయక అండ్ కంపెనీ అద్దెకు ఇస్తున్నారు.
ఒక్క రోజు అద్దె
రోజు లెక్కన వినాయకుడి విగ్రహాలు అద్దెకు ఇస్తున్నామని వినాయక అండ్ కంపెనీ నిర్వహకుడు నందకిషోర్ చెప్పారు. ఒక్క రోజు వినాయుడి విగ్రహం అద్దె రూ. 5,000. ఎన్ని రోజులు వినాయకుడి విగ్రహం పెట్టుకుంటారో అన్ని రోజులకు అద్దె వసూలు చేస్తామని నందకిషోర్ అన్నారు. వినాయకుడి విగ్రహం ఎంత ఖరీదు ఉందో అంత డబ్బు డిపాజిట్ చేసుకుని రసీదు ఇస్తామని, విగ్రహం తిరిగి తెచ్చి ఇచ్చిన తరువాత అద్దె మాత్రం పట్టుకుని వారి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని నందకిషోర్ వివరించారు.
ఆశ తీరుతుంది, డబ్బు మిగులుతుంది
భారీ గణేశుడి విగ్రహాలు పెట్టడానికి చాల మంది ఆసక్తి చూపిస్తారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టిస్తారు. అయితే భారీ వినాయకుడి విగ్రహాలు అద్దెకు తీసుకుని వెళ్లి ప్రతిష్టించి పూజలు చేస్తే వారి ఆశ తీరుతుంది, తిరిగి వినాయకుడి విగ్రహాలు తెచ్చి ఇస్తే వారికి డబ్బులు మిగులుతుందని వినాయక అండ్ కంపెనీ నిర్వహకుడు నందకిషోర్ అన్నారు.
పీఓపీ, మట్టి విగ్రహాలు లేవు
అద్దెకు ఇచ్చే వినాయకుడి విగ్రహాలు మట్టితో, పీఓపీతో తయారు చెయ్యమని వినాయక అండ్ కంపెనీ నిర్వహకుడు నందకిషోర్ చెప్పారు. ఫైబర్ తో భారీ వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తామని, వాన, గాలి, ఎండకు ఆ విగ్రహాలు ఏమీ కావని, అద్దెకు తీసుకున్న వారు సులభంగా, జాగ్రత్తగా తిరిగి తెచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని నందకిషోర్ అన్నారు.
రిటర్న్ గిఫ్ట్ వినాయకుడి విగ్రహం
భారీ వినాయకుడి విగ్రహాలు అద్దెకు తీసుకుని వెళ్లి వాటిని తిరిగి తెచ్చి ఇస్తున్న వారు ఓ చిన్న వినాయకుడి విగ్రహం తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేస్తున్నారని నందకిషోర్ చెప్పారు. భారీ వినాయకుడి విగ్రహం ప్రతిష్టించినట్లు ఉంటుంది, చిన్న వినాయకుడి విగ్రహం నీటిలో నిమజ్జనం చేసిన ఆనందం ఉంటుందని నందకిషోర్ వివరించారు.
తాళం వేసిన బీబీఎంపీ
బెంగళూరులోని కంబళగూడులో వినాయక అండ్ కంపెనీకి పెద్ద గౌడన్ ఉంది. ఈ గౌడన్ లో వందల సంఖ్యలో వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నారు. అయితే పీఓపీ విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ బీబీఎంపీ అధికారులు వినాయక అండ్ కంపెనీ గౌడన్ కు తాళం వేసుకుని వెళ్లిపోయారు. గౌడన్ లో మట్టి వినాయకుడి విగ్రహాలు, అద్దెకు ఇవ్వడానికి ఫైబర్ తో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయని, బీబీఎంపీ అధికారులు తాళం వెయ్యడం వలన మాకు చాల నష్టం జరిగిందని నందకిషోర్ విచారం వ్యక్తం చేస్తున్నారు.
విగ్నం ఎదురైతే ?
అద్దె వినాయకుడి విగ్రహాలు ప్రతిష్టించి వాటిని నిమజ్జనం చెయ్యకుండా తిరిగి ఇచ్చేస్తే విగ్నం ఎదురౌతుందని కొందరు అంటున్నారు. అయితే భారీ వినాయకుడి విగ్రహాలు తిరిగి ఇచ్చేసి చిన్న వినాయకుడి విగ్రహం తీసుకెళ్లి నిమజ్జనం చేస్తే ఎలాంటి విగ్నం ఎదురుకాదని కొందరు అంటున్నారు. అయితే అద్దె వినాయకుడి విగ్రహాల వ్యాపారం ఎంత వరకు కొనసాగుతుందో వేచి చూడాలని మరి కొందరు అంటున్నారు.