ఎవరో నాటీ పెట్టిన స్కూటీ పోస్టు..! మోదీ ప్రభుత్వానికి ఇచ్చింది పెద్ద ట్విస్టు..!!
ఢిల్లీ/హైదరాబాద్ : సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు పెట్టే పోస్టులు కొన్ని సందర్బాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలిస్తుంటాయి. అవే పోస్టులు ప్రజల్లో ఘోరమైన మార్పులకు నాంది పలుకుతాయి. మరికొన్న సందర్బాల్లో ఎంకి పెళ్లి సుబ్బి చావుకు చేటైన చందంగా రూపాంతరం చెందుతాయి. ఇంకొన్ని పోస్టులు పచ్చని సంసారాలు భగ్గున మండేలా చేస్తుంటాయి. ఇలాంటి ఘటనే కేంద్ర ప్రభుత్వం మెడకు చుట్టుకునేలా పరిణమించింది. సోషల్ మీడియాలో ఓ 'నాటీ' పెట్టిన స్కూటీ పోస్టు ప్రధాని మోదీ కి ఇబ్బందిగా పరిణమించింది. తీరా చూస్తే అది ఉత్తుత్తి పోస్టుగా అదికారులు తేల్చడంతో జనాలు ఉసూరుమన్నారు. సోషల్ మీడియాను కొందరు ఇలా ఫేక్, వేస్ట్ పోస్టులతో భ్రష్టు పట్టిస్తున్నారు. ఇది ఇటు సామాన్య జనాన్ని మాత్రమే కాదు, అటు ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెడుతోంది. తాజాగా ఏం జరిగిందో చూద్దాం.
బీజేపీకి ఫేక్ బుక్ భయం..! సోషల్ మీడియా పోస్టులంటేనే దడ..!!
సోషల్ మీడియాలో వారం పది రోజులుగా ఒక వార్త జోరుగా హల్ చల్ చేస్తోంది. 10వ తరగతి పాసైన బాలికల కోసం మోడీ ప్రభుత్వం... 'మోడీ స్కూటీ యోజన' ప్రవేశపెట్టిందన్నది ఆ వార్త. ఈ పథకంలో ఉన్నవారందరికీ ఫ్రీగా స్కూటీ ఇస్తారని ప్రచారం సాగింది. మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మరో అడుగు ముందుకేసి, అర్హులైన బాలికలకు ఫ్రీగా స్కూటీలు ఇవ్వాలనే లక్ష్యంతో స్కూటీ యోజన ప్రవేశపెట్టారన్నది దాని సారాంశం. పదోతరగతి చదివిన బాలికలు ఉన్నత విద్య అభ్యసించడానికి... చిన్నపాటి ఉద్యోగాలు చేసేందుకు 'ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ స్కూటీ యోజన పథకం ప్రవేశపెట్టారు. ఇందుకోసం నేరుగా కేంద్ర ప్రభుత్వం వెబ్ సైటులోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి'. ఈ పథకంపై జరుగుతోన్న ప్రచారమిది.
ఫేస్ బుక్ ఫేక్ బుక్ గా మారింది..! వాట్సాప్ వేస్ట్ యాప్ గా మారిందని బీజేపి ఆగ్రహం..!!
సోషల్ మీడియాలో ఫేస్ బుక్... వాట్సప్ గ్రూపులో ఈ పోస్టు బాగా వైరల్ గా మారింది. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకుంటామంటూ ఆన్ లైన్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి పథకమేదీ లేదన్న విషయం ఆన్ లైన్ సెంటర్ల నిర్వాహకులకు తెలుసు. కానీ, వారిలో కొందరు మోసానికి దిగారు. డూప్లికేట్ అప్లికేషన్ ఫామ్స్ సృష్టించి వీరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అందిన కాడికి దండుకొని అమాయకులను మోసం చేసేందకు తెరలేపారు. అదికారులు రంగ ప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.
లేని పథకాన్ని ఉన్నట్టుగా పోస్టు..! ఈ సేవకు తరలిన మహిళా లోక్..!!
వాస్తవంగా ఇలాంటి పథకం మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. గతంలో తమిళనాడు సీఎం పళని స్వామి 50 శాతం సబ్సిడీతో ఓ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ ఆలోచన కూడా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితది. ఆమె మరణానంతరం ఆమె గౌరవార్థం అక్కడి ప్రభుత్వం ఆమె 70 వ జయంతి సందర్భంగా ఈ పథకం ప్రవేశపెట్టింది. దీని పేరు 'అమ్మ స్కూటీ స్కీమ్'. ఈ పథకం వల్ల తమిళనాడులో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితకు విద్యార్థి లోకం నుంచి మంచి సానుకూల మద్దత్తు లభించింది.
రంగంలోకి దిగిన యంత్రాంగం..! తప్పుడు సమాచారంగా కొట్టేసిన అదికారులు.!!
ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పథకం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పోస్టుల నేపథ్యంలో ఎవరికి వారు సొంతంగా అప్లై చేసుకుని... తాము మోసపోయామని వాపోతున్నారు. ఎవరికి వారు వారం పది రోజులుగా తమ కుల ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం మీ- సేవల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు అప్లై చేసుకున్నాక ఇలాంటి పథకం కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని తెలుసుకుని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శలు చేస్తున్నారు. చివరకు ఈ ప్రచారం జోరుగా జరుగుతూ బీజేపీపై విమర్శలు ఎక్కువ అవుతుండడంతో... ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగి ఇదంతా అసత్య ప్రచారం అని నమ్మవద్దని ప్రకటనలు ఇస్తున్నారు. ఒక్క ఫేక్ పోస్టు.. బీజేపీ నాయకులను ఎంతగా టెన్షన్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు.