పాక్ యుద్ధానికి రెచ్చగొడుతోందా..? సరిహద్దుల్లో యుద్ధవిమానాలు మోహరింపు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో భారత సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ గుర్రుగా ఉంది. అంతేకాదు భారత్పై చర్యలు తీసుకోవాలంటూ అంతర్జాతీయ సమాజంను వేడుకుంటోంది. ఇక ఆయా ప్రపంచదేశాలు భారత అంతర్గత వ్యవహారంలో జోక్యం ఉండబోదని చెప్పడంతో ఇమ్రాన్ఖాన్ సర్కార్కు నిద్ర పట్టడం లేదు. భారత్ను ఎలాగైనా సరే ఎదుర్కొనాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ సైన్యం మెల్లగా తమ బలగాలను లడఖ్ ప్రాంతం వద్ద మోహరిస్తోంది. అంతేకాదు ఆ దేశ ఎయిర్ఫోర్స్ను కూడా సరిహద్దులకు దగ్గరలో మోహరించింది పాక్.
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో సీ-130 రవాణా విమానాల ద్వారా యుద్ధ సామగ్రిని శనివారం స్కర్దు ఎయిర్ బేస్కు పాకిస్తాన్ తరలించింది. ఇదిలా ఉంటే ఏ క్షణమైనా ఏమైనా జరగొచ్చనే సమాచారం అందుకున్న భారత బలగాలు సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేశాయి. పరిస్థితిని అత్యంత దగ్గరగా పరిశీలిస్తున్నాయి. పాక్ ఏమాత్రం కాలు దువ్వినా సహించేది లేదన్నట్లుగా భారత భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. పాకిస్తాన్ జేఎఫ్ -17 యుద్ధ విమానాలను వినియోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత్ భావిస్తోంది.
ఇదిలా ఉంటే యుద్ధ విమానాల్లో తరలించిన ఎక్విప్మెంట్ మొత్తం యుద్ధ విమానాల కోసం వినియోగించే సామగ్రిని తరలించినట్లు తమ వద్ద సమాచారం ఉన్నట్లు భారత అధికారులు తెలిపారు.పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వేస్తున్న అడుగులను భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీలు నిశితంగా పరిశీలిస్తున్నారు. పాకిస్తాన్ దేశం మొత్తంలో ఏం జరుగుతోందో భారత ఇంటెలిజెన్స్ సంస్థలు ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తున్నాయి. చాలా ఏళ్ల క్రితం అమెరికా సరఫరా చేసిన పాతతరం సీ -130 రవాణా విమానాలను పాకిస్తాన్ సామగ్రిని చేర్చేందుకు పాక్ వినియోగిస్తున్నట్లు సమాచారం. త్వరలో భారత్ పైకి యుద్ధం చేసేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగమే ముందస్తుగా సామగ్రిని చేరవేస్తోందని సమాచారం.
భారత్ పై దాడి చేయాలంటే సరిహద్దులో ఉన్న స్కర్దు ఎయిర్ బేస్ను పాకిస్తాన్ వినియోగిస్తుంది. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ స్కర్దు ఎయిర్బేస్లో కదలికలు కనిపించడంతో భారత్ పై మరో కుట్రకు పాక్ తెరతీసిందనే విషయం స్పష్టమవుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు భారత్ను దోషిగా నిలబెట్టే కుటిల ప్రయత్నం పాక్ చేసింది. ఇక ఆ పప్పులు ఉడకకపోవడంతో తనే స్వయంగా రంగంలోకి దిగి భారత్ను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.