‘అంబానీ బాంబు’ కేసుపై మరో బాంబు -ఏదో కుట్ర దాగుందన్న మహా సీఎం -ఎన్ఐఏ దర్యాప్తుపై అనుమానం
ఆసియాలోనే అత్యంత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలను నిలిపిన వాహనం తాలూకు యజమాని అనుమానాస్పద రీతిలో చనిపోవడం సంచలనం రేపగా, ఇప్పుడీ కేసులను నేరుగా కేంద్ర ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుండటంపై సాక్ష్యాత్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర అనుమానాలు వ్యక్తం చేయడం మరింత సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..
ప్రజలు నపుంసకులు -ఏపీలో మగాళ్లు లేరు -రఘుగాడినే వేశామన్నది జగన్ లెక్క: వైసీపీ ఎంపీ అనూహ్యం
ఎన్ఐఏ చేతికి దర్యాప్తు..
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబులతో కూడిన వాహనం కేసును కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక స్క్వాడ్ (ఏటీఎస్) నుంచి దర్యాప్తు బాధ్యతలు ఎన్ఐఏ చేతిలోకి వెళ్లినట్లయింది. ఆ వాహనానికి సంబంధించిన మన్సుఖ్ హిరెన్ అనుమానాస్పద మరణంపై కూడా తామే దర్యాప్తు చేస్తామని ఎన్ఐఏ అధికారులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. దీనిపై..
ఏదో కుట్ర దాగుందన్న సీఎం
అంబానీ ఇంటి వద్ద బాంబు బెదిరింపు, సదరు వాహనం యజమాని అనుమానాస్పద మరణం కేసుల్ని ముంబై ఏటీఎస్ దర్యాప్తు చేస్తుండగా.. అంతలోనే కేంద్రం హడావుడిగా జోక్యం చేసుకుని ఎన్ఐఏను రంగంలోకి దింపడంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీరు చూస్తుంటే.. ఈ వ్యవహారంలో ఏదో తెలియని కుట్ర దాగున్నట్లుగా అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, కేసును ఎన్ఐఏ టేకప్ చేసినంత మాత్రాన ముంబై ఏటీఎస్ దీన్నుంచి తప్పుకోబోదని, సమాంతర దర్యాప్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు..
హత్య కేసుగా ఏటీఎస్ ఎఫ్ఐఆర్
నిజానికి అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు, వాహనం యజమాని మృతి కేసులను ఆదివారమే ఏటీఎస్ కు బదిలీ అయ్యాయి. జెలెటిన్ స్టిక్స్ నింపిన స్కార్పియో వాహనం యజమాని మన్సుఖ్ హిరెన్ అనుమానాస్పద మరణాన్ని ఏటీఎస్ బృందం హత్య కేసుగా పరిగణిస్తూ ఆదివారమే ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఇది జరిగి 24 గంటలైనా తిరక్కముందే, మొత్తం కేసుల్ని కేంద్రం ఎన్ఐఏకు బదిలీ చేసింది. ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ అధికార యంత్రాంగం అలానే ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై కేంద్రం విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉందని ఠాక్రే పేర్కొన్నారు.
బీజేపీ తీరు అనూహ్యం..
''మహారాష్ట్ర ఏటీఎస్ దర్యాప్తు చేస్తోన్న కేసుల్ని జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పటించడం ఏదో తేడాగా ఉంది. రాష్ట్ర యంత్రాంగంపై విశ్వాసం లేనట్లయితే, ఇంధన ధరలను తగ్గించాలని ప్రతిపక్ష బీజేపీ వాళ్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటమెందుకు? అంబానీ బాంబు కేసులో మహా పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన బీజేపీ నేతలు.. ఇటీవల ముంబైలో అనుమానాస్పద రీతిలో చనిపోయిన దాద్రా నగర్ ఎంపీ మోహన్ దల్కర్ కేసులో మాత్రం నోరు మెదపడం లేదు. సారూప్యం ఉన్న కేసుల్లో బీజేపీ అనూహ్యంగా స్పందిస్తున్నది. కాబట్టే, ఎన్ఐఏకు విడిగా మా ఏటీఎస్ తన దర్యాప్తును కొనసాగిస్తుంది. ఎంపీ దల్కర్ మృతి కేసును కూడా లాజికల్ ఎండ్ కు తీసుకొస్తాం'' అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
ఇంకాస్త జఠిలంగా బాంబు కేసు..
ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలియా వద్ద ఫిబ్రవరి 25న ఒక ఎస్యూవీ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలైన జెలటిన్స్టిక్స్తోపాటు అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ఒక లేఖ అందులో లభించాయి. ఆ వాహనం గురించి ముంబై పోలీసులు ఆరా తీయగా మన్సుఖ్ హిరెన్ అనే వ్యక్తి దానిని వినియోగించినట్లు గుర్తించారు. అయితే ఈ నెల 5న ఆయన అనుమానాస్పదంగా మరణించారు. ధానే వద్ద ఓ కాలువలో హిరేన్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. బాంబు బెదిరింపు కేసులో ఏకైక లీడ్ హిరేన్ మృతి చెందడంతో దీన్ని హత్య గా అనుమానిస్తూ ఏటీఎస్ ఆదివారంనాడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంతలోనే సోమవారం ఈ కేసులను ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీటిని పరిష్కరించగల సత్తా ఏటీఎస్ కు ఉందని మహారాష్ట్ర హోం మంత్రి అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. తాజాగా కేంద్రం తీరుపై మహారాష్ట్ర సీఎం అనుమానాలు వ్యక్తం చేయడంతో వ్యవహారం మరింత జఠిలంగా మారింది..
ఒకే దెబ్బకు కేసీఆర్, జగన్లను చెడామడా -మహిళా దినోత్సవాన ys sharmila సంచలన ప్రసంగం