బీజేపీ వస్తే గుండు కొట్టించుకుంటా, భయం: ఏఏపీ నేత
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమ్నాథ్ భారతి భారతీయ జనతా పార్టీ పైన శుక్రవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాను గుండు గీయించుకుంటానని సవాల్ చేశారు. ఒకవేళ బీజేపీ గనుక ఢిల్లీ రాష్ట్ర పగ్గాలు చేపడితే, అది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అన్నారు.
భారతీయ జనతా పార్టీకి అధికార దాహం నానాటికీ పెరిగిపోతోందన్నారు. ద్రవ్యోల్బణం అంశంపై వారు దృష్టి సారించాలన్నారు. అసలు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఇప్పటి వరకు వారేం చేశారని ప్రశ్నించారు. బీజేపీ అధికారం గురించి ఆలోచించడం పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని నిలదొక్కుకునేలా చేయాలన్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని, వారు ఆందోళన చెందుతున్నారన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని లేఖ ఇచ్చిన పార్టీని, ఆహ్వానించడం సరికాదని అంతకుముందు మరో ఏఏపీ నేత అశుతోష్ అన్నారు. కాగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని బీజేపీని లెఫ్టినెంట్ గవర్నర్ కోరిన విషయం తెలిసిందే. మరోవైపు, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయమై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.