మదమెక్కింది: అమ్మాయిని చితకబాదిన పోలీస్ అధికారి కొడుకు
ఢిల్లీ: అధికారం చేతిలో ఉంది కదా అని ఏమి చేస్తే అది చెల్లుతుంది అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు కొందరు బడాబాబుల పిల్లలు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఢిల్లీలో వెలుగు చూసింది. రోహిత్ సింగ్ తోమర్ అనే వ్యక్తి ఓ మహిళను ఢిల్లీ కార్యాలయంలో ఈడ్చుకుంటూ చితకబాదాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
చదువుల సరస్వతిపై కామాంధుల కాటు
ఇక అసలు విషయానికొస్తే... రోహిత్ సింగ్ తండ్రి ఢిల్లీలో పోలీస్ అధికారి. తండ్రి అధికారాన్ని చూసుకున్నాడో ఏమో తెలియదు కానీ ఇతగాడు ఓ మహిళను దారుణంగా కొట్టాడు. ఈ ఘటన సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో ఉన్న ప్రైవేట్ కార్యాలయంలో చోటుచేసుకుంది. మహిళ ఎంతగా ప్రాధేయపడినప్పటికీ రోహిత్ వినిపించుకోలేదు. ఆమెను ఈడ్చుకెళ్లి ముఖాన్ని నేలకేసి కొట్టాడు. కాలుతో తన్నాడు. అయితే ఈ ఘటనను రోహిత్ మిత్రడు వీడియో తీశాడు. తను కూడా ఆపాల్సిందిగా రోహిత్ను కోరాడు. అయినప్పటికీ వినిపించుకోలేదు. వీరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు.
ఈ వీడియో కాస్త వైరల్గా మారింది. తనను రోహిత్ అత్యాచారం చేశాడంటూ యువతి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను చూసిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సీరియస్ అయ్యారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్తో మాట్లాడారు. వెంటనే రోహిత్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. గురువారం వరకు ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయితే రోహిత్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. అమ్మాయిని చితకబాదడం చూసి రోహిత్తో తన పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ఆమె చెప్పింది.
మరోవైపు బాధిత మహిళ శుక్రవారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. రోహిత్ తన స్నేహితుడి ఆఫీస్కు రమ్మని చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో తనను చితకబాదాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు రోహిత్ను అరెస్టు చేశారు.